పవన్ సినిమా కోసం ఫేవరెట్ టెక్నీషియన్‌


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టాలీవుడ్లో అత్యంత ఇష్టపడే, గౌరవించే టెక్నీషియన్లలో ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి ఒకరు. పవన్ తెరంగేట్రం చేయడానికి ముందు నుంచే ఆనంద్‌తో పరిచయం ఉంది. కెరీర్లో తొలి అడుగులు వేస్తున్నపుడే ఆయనతో ఎక్కువగా సమయం గడిపేవాడు. సినిమాకు సంబంధించి సాంకేతిక విషయాలు ఎన్నో ఆనంద్ నుంచి నేర్చుకున్నట్లు పవన్ ఇంటర్వ్యూల్లో చెబుతూ ఉంటాడు. పవన్ నటించిన తొలి ప్రేమ, తమ్ముడు, ఖుషి, జల్సా లాంటి చిత్రాలకు కళా దర్శకత్వం వహించాడు ఆనంద్ సాయి. వ్యక్తిగతంగా కూడా వీరి మధ్య మంచి అనుబంధం ఉంది.

కొంత విరామం తర్వాత పవన్ సినిమాకు ఆనంద్ సాయి పని చేయబోతున్నాడు. ప్రస్తుతం ‘వకీల్ సాబ్’ను పూర్తి చేసి క్రిష్ సినిమాతో పాటు, ‘అయ్యప్పనుం కోషీయుం’ రీమేక్2లో పవన్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇవి రెండూ పూర్తయ్యాక పవన్ హరీష్ శంకర్ దర్శకత్వంలో నటించనున్న సంగతీ విదితమే.

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఆ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్‌గా ఆనంద్ సాయి పని చేయబోతున్నాడు. ఈ విషయాన్ని మైత్రీ సంస్థ ట్విట్టర్లో అధికారికంగా ప్రకటించింది. ఆనంద్ సాయి ఐదేళ్లకు పైగా విరామం తర్వాత ఓ సినిమాకు పని చేస్తుండటం విశేషం. ఈ ఐదేళ్లు ఆయన తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టి యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో కీలకంగా ఉన్నారు.

ఈ ఆలయాన్ని డిజైన్ చేసింది, దగ్గరుంచి నిర్మాణాన్ని పూర్తి చేయించింది ఆనంద్ సాయినే. ఈ ఆలయ డిజైన్‌కు ఎంతగా ప్రశంసలు దక్కాయో తెలిసిందే. ఈ ఆలయం పూర్తి స్థాయిలో సిద్ధమైతే దాని కళే వేరుగా ఉంటుందనడంలో సందేహం లేదు. తెలంగాణలో ప్రఖ్యాత పుణ్యక్షేత్రంగా అది విలసిల్లే అవకాశముంది. ప్రస్తుతం ఆలయ పునర్నిర్మాణం చివరి దశలో ఉంది. పవన్-హరీష్ సినిమా మొదలవడానికి ఇంకా సమయం ఉంది కాబట్టి ఈ లోపు ఆనంద్ సాయి యాదాద్రి పనంతా పూర్తి చేస్తారు. ఈ ఏడాది చివర్లో ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్లే అవకాశముంది.