రాజకీయాలకు టాటా.. సినిమాల్లో వేట

తాను రాజకీయాల్లోకి రాబోనంటూ రెండు నెలల కిందటే ప్రకటన చేసి అభిమానులకు పెద్ద షాకిచ్చాడు సూపర్ స్టార్ రజినీకాంత్. దీని తాలూకు ప్రకంపనలు ఇంకా కొనసాగుతున్నాయి. అభిమానుల నుంచి నిరసన కొనసాగుతూనే ఉంది. తన నిర్ణయంపై ఆందోళన కార్యక్రమాలు చేయడం, తననకు ఇంకా బాధ పెట్టడం పట్ల రజినీ ఆవేదన వ్యక్తం చేశాడు కూడా. అయినా అభిమానులేమీ తగ్గట్లేదు.

ఇక వాళ్లను పట్టించుకుంటే కష్టమని రజినీ రాజకీయాల సంగతి పూర్తిగా పక్కన పెట్టేసి సినిమాల మీద దృష్టి పెడుతున్నట్లున్నారు. దీపావళికి తన కొత్త చిత్రం ‘అన్నాత్తె’ రిలీజ్ డేట్ ఖరారు చేసిన నేపథ్యంలో త్వరలోనే ఆ సినిమా షూటింగ్‌ను పున:ప్రారంభించాలనుకుంటున్నారు రజినీ. అంతే కాక మరో కొత్త సినిమాకు కూడా ఆయన రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ‘అన్నాత్తె’ పూర్తి కాగానే ఆ చిత్రం మొదలుపెట్టబోతున్నారు రజినీ.

తనతో ‘పేట’ సినిమా తీసిన కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రజినీ మళ్లీ నటించబోతున్నారు. వీరి కలయికలో మరో సినిమా రావొచ్చని ఇంతకుముందే ప్రచారం జరిగింది. తాజాగా ఆ సినిమా ఖరారైనట్లు సమాచారం. ఒక అభిమానిలా ‘పేట’లో రజినీని ప్రెజెంట్ చేసి ప్రశంసలందుకున్నాడు కార్తీక్. కానీ అందులో అతడి మార్కు కథాకథనాలు మిస్సయ్యాయనే విమర్శలు వచ్చాయి. సినిమా అనుకున్నంతగా ఆడలేదు. ఈసారి మాత్రం రజినీకి పెద్ద హిట్టివ్వాలని పట్టుదలతో ఉన్నాడు కార్తీక్.

‘పేట’ తర్వాత రజినీ అల్లుడు ధనుష్‌తో కార్తీక్ సినిమా తీసిన సంగతి తెలిసిందే. ‘జగమే తంత్రం’ పేరుతో తెరకెక్కిన ఆ చిత్రం త్వరలోనే నెట్ ఫ్లిక్స్ ద్వారా రిలీజవుతుందంటున్నారు. లాక్ డౌన్ కంటే ముందే ఈ సినిమా పూర్తయింది. దీంతో ఖాళీ టైంలో కార్తీక్.. రజినీకాంత్ కోసం స్క్రిప్టు రెడీ చేశాడు. ఇటీవల ఆయన్ని కలిసి కథ వినిపించడం, ఆయన ఓకే చేయడం జరిగాయట. ఈ సినిమాను ఏ బేనర్లో చేస్తాడో తెలియదు కానీ.. త్వరలోనే దీనిపై ప్రకటన రాబోతున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత కూడా ఓపిక ఉన్నంత వరకు సినిమాలు చేసి అభిమానులను ఆ రకంగా అయినా అలరించాలని రజినీ నిర్ణయించుకున్నాడట.