ఇక్కడ పవన్-రానా.. అక్కడ వాళ్లు

సరిగ్గా ఏడాది కిందట మలయాళంలో పెద్దగా అంచనాల్లేకుండా వచ్చిన ఓ సినిమా సంచలన విజయం సాధించింది. ఆ చిత్రం దేశవ్యాప్తంగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. లాక్ డౌన్ టైంలో భాషా భేదం లేకుండా ఆ సినిమాను విరగబడి చూశారు ప్రేక్షకులు. ఇప్పుడా సినిమా మూడు ప్రధాన భాషల్లో రీమేక్ కూడా అవుతోంది. ఆ సినిమానే.. అయ్యప్పనుం కోషీయుం.

పృథ్వీ రాజ్, బిజు మీనన్ ప్రధాన పాత్రల్లో రైటర్ టర్న్డ్ డైరెక్టర్ సాచి రూపొందించిన ఈ చిత్రం ఇద్దరు వ్యక్తుల మొదలైన చిన్న గొడవ ఇగో క్లాష్ కారణంగా ఏ స్థాయికి వెళ్లిందనే కథాంశంతో తెరకెక్కింది. ఈ చిత్రం తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యువ కథానాయకుడు రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తమిళంలోనూ ఈ సినిమా రీమేక్ కోసం సన్నాహాలు జరుగుతున్నాయి. హిందీ రీమేక్ కూడా త్వరలోనే పట్టాలెక్కబోతోంది. ఈ చిత్రంలో లీడ్ రోల్స్ చేసే నటులు కూడా ఖరారైనట్లు సమాచారం.

‘అయ్యప్పనుం కోషీయుం’ హిందీ రీమేక్ హక్కులను నటుడు, నిర్మాత జాన్ అబ్రహాం సొంతం చేసుకున్నాడు. అతను ఇందులో నటించబోతున్నాడు కూడా. ఒరిజినల్లో బిజు చేసిన పాత్రను జాన్ చేయనున్నాడట. పృథ్వీ రాజ్ పాత్ర కోసం అభిషేక్ బచ్చన్‌ను అడుగుతున్నారట. ఇంకా ఈ చిత్రానికి దర్శకుడు ఖరారవ్వలేదు. తన టీంతో స్క్రిప్టును హిందీకి అనుగుణంగా మార్చే ప్రయత్నంలో ఉన్నాడు జాన్ అబ్రహాం. అభిషేక్‌కు ఈ సినిమాలో నటించడానికి పెద్దగా అభ్యంతరాలు లేకపోవచ్చు.

జాన్, అభిషేక్ కలిసి ఇంతకుముందు రెండు సినిమాల్లో నటించారు. అందులో ఒకటి.. ధూమ్. అదెంత పెద్ద హిట్టయిందో తెలిసిందే. ఆ తర్వాత వీళ్లిద్దరూ ‘దోస్తానా’లో నటించారు. అది కూడా బాగానే ఆడింది. ఇప్పుడు మూడోసారి వీళ్లిద్దరూ జోడీ కట్టబోతున్నారు. త్వరలోనే ‘అయ్ప్పనుం కోషీయుం’ హిందీ రీమేక్ సెట్స్ మీదికి వెళ్లనుందట. తమిళంలోనూ ఈ ఏడాదే దీని రీమేక్ మొదలయ్యే అవకాశాలున్నాయి.