మళ్లీ పెంచేసిన మాస్ రాజా


టాలీవుడ్లో ఎప్పుడూ ఒక హీరో పారితోషకం గురించి తరచుగా చర్చ జరుగుతూ ఉంటుంది. ఆ హీరో మాస్ రాజా రవితేజ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మాస్ రాజా పారితోషకం పెంచేశాడని.. తగ్గించుకోమన్నా తగ్గించుకోవట్లేదని తరచుగా రూమర్లు వినిపిస్తుంటాయి టాలీవుడ్ సర్కిల్స్‌లో. రెమ్యూనరేషన్ విషయంలో రవితేజ అస్సలు రాజీ పడడని అంటుంటారు. ఫ్లాపుల్లో ఉన్నపుడు కూడా ఎక్కువ పారితోషకాలు డిమాండ్ చేసి నిర్మాతల్ని ఇబ్బంది పెడుతుంటాడని కూడా వార్తలు వినిపిస్తుంటాయి.

ఐతే ఇప్పుడు మాస్ రాజా కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు ‘క్రాక్’తో. కరోనా విరామం తర్వాత, థియేటర్లు 50 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తుండగా మరో మూడు చిత్రాలతో పోటీ పడి సంక్రాంతి బరిలో నిలిచిన ఈ చిత్రం అనూహ్యమైన వసూళ్లు సాధించింది. ఇప్పటికే రూ.30 కోట్ల షేర్ మార్కును దాటేసి రవితేజ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.

ఈ నేపథ్యంలో మాస్ రాజా మళ్లీ పారితోషకం పెంచేశాడని అంటున్నారు. ఇంతకుముందు రూ.10-12 కోట్ల మధ్య తీసుకున్న రవితేజ.. ఇప్పుడు రూ.15 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. రవితేజ తీరు తెలిసిన వాళ్లకు ఇదేమీ ఆశ్చర్యంగా అనిపించడం లేదు. ఐతే రవితేజ సినిమా హిట్టయితే ఆ పారితోషకం పెద్ద విషయమే కాదు అని, ఆయన అన్నీ ఓకే అనుకున్న వాళ్లే సినిమాలు నిర్మిస్తారు కాబట్టి దీనిపై ఇతరులు రచ్చ చేయాల్సిన అవసరం లేదని అతడి సన్నిహిత వర్గాలు అంటున్నాయి.

ప్రస్తుతం మాస్ రాజా రమేష్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడి’ సినిమా చేస్తున్నాడు. రమేష్ వర్మ ట్రాక్ రికార్డు ఏమంత బాగా లేదు. ప్రొడ్యూస్ చేస్తున్నది పేరున్న నిర్మాత కాదు. హీరోయిన్లూ కొత్త వాళ్లే. నేపథ్యంలో ఈ సినిమాకు రవితేజ పేరు మీదే బిజినెస్ జరగాలి. ఇలాంటి సినిమాకు రవితేజ రూ.15 కోట్ల పారితోషకం తీసుకుంటే తప్పేంటన్నది అతడి సన్నిహితుల మాట.