పవన్ ఇండిపెండెన్స్ డే గిఫ్ట్?


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జోరుమీదున్నాడిప్పుడు. కరోనా విరామం తర్వాత ఆయన శరవేగంగా సినిమాలు పూర్తి చేసే పనిలో పడ్డాడు. ఇప్పటికే ‘వకీల్ సాబ్’ను అవగొట్టేశాడు. వెంటనే మధ్యలో ఆపేసిన క్రిష్ సినిమాను పున:ప్రారంభించాడు. ఆ సినిమాతో సమాంతంరంగా ఇప్పుడు మరో చిత్రాన్ని లైన్లో పెట్టాడు. అదే.. అయ్యప్పనుం కోషీయుం రీమేక్. అనౌన్స్‌మెంట్ ఆలస్యంగా జరిగింది కానీ.. ఈ చిత్రం ముందు లైన్లో ఉన్న సినిమాలను వెనక్కి నెట్టేసేలాగే కనిపిస్తోంది. దీని తర్వాతే క్రిష్ సినిమా విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ చిత్రం పూర్తయ్యాక కానీ హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి సినిమాలు లైన్లోకి వచ్చేలా లేవు. పవన్ కెరీర్లోనే అత్యంత వేగంగా పూర్తి చేయబోయే సినిమాగా దీన్ని చెబుతుండటం విశేషం. సోమవారమే ‘అయ్యప్పనుం కోషీయుం’ రీమేక్ సెట్స్ మీదికి వెళ్లిన సంగతి తెలిసిందే.

అసలే రీమేక్. పైగా త్రివిక్రమ్ పక్కాగా స్క్రిప్టు రెడీ చేసి ఇచ్చాడు. పవన్‌తో పాటు రానా అవసరమైన మేర డేట్లు సర్దుబాటు చేసి ఇచ్చారు. ఎక్కువ లొకేషన్లు అవసరం లేదు, విదేశాలకు వెళ్లాల్సిన పని లేదు. చాలా వరకు సెట్టింగ్స్‌లోనే సినిమా అయిపోతుంది. దీంతో అన్నీ పక్కాగా రెడీ చేసుకుని శరవేగంగా సినిమాను పూర్తి చేయడానికి రంగం సిద్ధం చేసుకుందట చిత్ర బృందం. మూణ్నాలుగు నెలల్లోనే ఈ సినిమా అయిపోతుందని అంటున్నారు. అంతే కాదు.. ఈ చిత్రానికి రిలీజ్ డేట్ ఓకే అయినట్లు చెబుతున్నారు. అన్నీ కుదిరితే ఈ ఏడాది ఇండిపెండెన్స్ డే కానుకగా ‘అయ్యప్పనుం కోషీయుం’ రీమేక్‌ను విడుదల చేయాలని అనుకుంటున్నారట.

వేసవికి ఆల్రెడీ షెడ్యూల్ ప్యాక్డ్‌గా కనిపిస్తోంది. పైగా ఆ సీజన్లో పవన్ సినిమానే అయిన ‘వకీల్ సాబ్’ వస్తోంది. దసరా, దీపావళికి వేరే భారీ చిత్రాలున్నాయి. కాబట్టి మధ్యలో ఖాళీ ఉన్న ఇండిపెండెన్స్ డే వీకెండ్‌ను పవన్ తీసుకోబోతున్నాడట. మంచి రిలీజ్ డేట్ల కోసం విపరీతమైన పోటీ నెలకొన్న నేపథ్యంలో త్వరలోనే ఆగస్టు 15న తమ చిత్రం విడుదలవుతుందని కర్చీఫ్ వేసేయనుందట సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ.