ఏదైనా పెళ్లో.. మరో ఫంక్షనో.. భార్యా భర్తలు ఇరువురు వెళ్లాలని నిర్ణయించుకున్నప్పుడు.. సహజంగా దంపతుల్లో ఉత్సాహం ఉంటుంది. భర్త ముందుగానే రెడీ అయిపోతాడు. కానీ, భార్య విషయానికి వస్తే మాత్రం ఒకింత లేటవుతుంది. అతివలు అలంకార ప్రియులుకాబట్టి.. చీరల సెలక్షన్ నుంచి నగల సెలక్షన్ దాకా కొంత టైమ్ పడుతుంది. పైగా వెళ్లే పంక్షన్ను బట్టి మహిళలు సిద్ధమవ్వాలని భావిస్తారు. దీంతో ఉదయం 10 గంటలకు ఇంటి నుంచి బయలు దేరుదామని అనుకున్న వారు కాస్తా.. 11 గంటలు దాటిపోయినా.. అడుగు బయట పెట్టలేని పరిస్థితి ఉంటుంది.
ఇంకేముంది.. భర్తల రుసరుస… భార్యల బుజ్జగింపులు కామన్. ఇక, అప్పటికే సదరు వేడుక సగం అయిపోతుంది!. మరి ఈ సమస్య నుంచి ఎలా బయట పడాలి? అనేది ఇప్పటికీ చాలా మంది పురుష పుంగవులకు సమాధానం లేని ప్రశ్నే. అందుకే.. తాజాగా.. ప్రముఖ నటుడు బాలీవుడ్ బాద్షా అమితాబ్ బచ్చన్ చెప్పిన టెక్నిక్ ఫాలో అయిపోండి. ఆయన కౌన్ బనేగా కరోడ్ పతి కార్యక్రమంలో ఓ ప్రేక్షకుడు అడిగిన ఇదే ప్రశ్నకు బహుచక్కని సమాధానం చెప్పారు. తన భార్య కూడా అలంకార ప్రియురాలేనని చెప్పుకొచ్చారు. పైగా ఒకప్పుడు బాలీవుడ్ను ఆమె కూడా ఏలింది కదా!
అందుకే తన భార్య, రాజ్యసభ సభ్యురాలు.. జయాబచ్చన్.. తాను ఏదైనా కార్యక్రమానికి ఉమ్మడిగా వెళ్లాలని అనుకుంటే.. ఒక టెక్నిక్ను పాటిస్తానని అమితాబచ్చన్ వెల్లడించారు. అది చాలా సింపుల్ అని కూడా చెప్పారు. ఉదాహరణకు ఏదైనా కార్యక్రమం 10 గంటలకు ప్రారంభమవుతుందని అనుకుంటే.. తాను తన భార్యకు 9 గంటలకే కార్యక్రమం ప్రారంభమవుతుందని చెబుతారట అమితాబ్. నిజానికి కార్యక్రమానికి బయలు దేరే సమయం 10 గంటలకే!. అయినప్పటికీ.. గంట ముందుకు జరిపి చెప్పడంవల్ల.. జయాబచ్చన్.. 9కి రెడీ అవుతారని.. దీంతో తనకు సమయాభావం ఇబ్బందులు తప్పుతాయని ఆయన వెల్లడించారు.
ఈ టెక్నిక్ అద్భుతంగా ఉందని నెటిజన్లు.. ముఖ్యంగా పురుషులు పేర్కొనడం.. అమితాబ్ తెలివిని మెచ్చుకోవడం గమనార్హం. ఏ కార్యక్రమానికి హాజరు కావాలన్నా.. సదరు కార్యక్రమం సమయాన్ని ముందుగా భార్యలకు చెప్పవద్దని కూడా అమితాబ్ సలహా ఇచ్చారు. ఒక గంటో గంటన్నరో ముందుకు జరిపి.. చెప్పాలని అన్నారు. మొత్తానికి భార్యా భర్తల మధ్య తరచుగా ఏర్పడే గిల్లి కజ్జాలకు కారణమవుతున్న ఈ సమయాభావానికి అమితాబ్ ఇచ్చిన టెక్నిక్ బాగుందని అంటున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates