దీపావళికి డబ్బింగుల జోరు… టాలీవుడ్ హీరోలు లేరు  

నవంబర్ దీపావళి పండక్కు బాక్సాఫిస్ పోటీ మంచి రసవత్తరంగా మారబోతోంది. ముందుగా ‘రామాయణ పార్ట్ 1’ వస్తుంది కాబట్టి దానికి పోటీగా వెళ్లడం ఎందుకులెమ్మని టాలీవుడ్ నిర్మాతలు ఆ స్లాట్ ని వదిలేశారు. ఆ విజువల్ గ్రాండియర్ ముందు నిలవలేమోననే అనుమానంతో వెనుకడుగు వేశారు. కానీ తమిళ ప్రొడ్యూసర్లు అయితే మాకేంటి అంటున్నారు. ముందుగా సూర్య ‘సీన్’ ఆల్రెడీ నవంబర్ 6 రిలీజ్ డేట్ అధికారికంగా ప్రకటించింది. షూటింగ్ అయిపోయి పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది.

ఇవాళ ఉదయం నయనతార ప్యాన్ ఇండియా మూవీ ‘మహాశక్తి (మూకుతి అమ్మన్ 2)’ ని పటాసుల ఫెస్టివల్ కి రిలీజ్ చేస్తామని టీజర్ లో చెప్పేశారు. రామాయణ వస్తుందని తెలిసి, సీన్ అనౌన్స్ మెంట్ ఉందని గుర్తించి మరీ పోటీకి సై అన్నారంటే విషయం ఏదో గట్టిగా ఉన్నట్టుంది. విచిత్రంగా టాలీవుడ్ నుంచి ఎవరూ ఈ రేసులో లేరు. సెప్టెంబర్ అక్టోబర్ లో వాయిదా పడే ఛాన్స్ ఉన్నవి కూడా దీపావళిని వదిలేసి మిగిలిన ఆప్షన్లను జల్లెడ పడుతున్నాయి. ఇదే పెద్ద ట్విస్టు.

ఇక్కడ ఇంకో ముఖ్యమైన సంగతి ఏంటంటే ‘గాడ్జిల్లా మైనస్ జీరో’ ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున రిలీజవుతోంది. ఓవర్సీస్ లో స్క్రీన్ల విషయంలో రామాయణకు చిక్కులు తప్పవని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అలాంటప్పుడు మిగిలిన వాటికి థియేటర్లు దొరకడం కొంచెం ఇబ్బంది అవుతుంది. రామాయణ అంటే ఏదో సోనీ సంస్థ పంపిణి కాబట్టి మేనేజ్ అవుతుంది కానీ మిగిలిన వాటికి అంత సులభంగా ఛాన్స్ ఉండదు. అయినా సరే వెనుకడుగు వేయడం లేదు.

ఒకవేళ జైలర్ 2 కనక దసరా నుంచి తప్పుకుని వేరే డేట్ కావాలంటే దీపావళికే వెళ్లాల్సి ఉంటుంది. అప్పుడు సూర్య, నయనతారలో ఒకరు తప్పుకోవచ్చు. కానీ చెన్నై వర్గాలు మాత్రం జైలర్ 2 పోస్ట్ పోన్ ఉండదని, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ పనులు పూర్తి చేయడానికి కంకణం కట్టుకున్నారని అంటున్నాయి. ఏది నిజమో ఏది కాదో ఇంకో రెండు మూడు రోజుల్లో క్లారిటీ వస్తుంది. ఏది ఏమైనా దివాలికి తెలుగు జనాలు మాత్రం డబ్బింగ్ సినిమాలతో సరిపెట్టుకోవాలి.