ఒత్తిడి తట్టుకోగలవా వశిష్టా

దర్శకుడు వశిష్ఠ మళ్ళీ వార్తల్లోకి వచ్చారు. నిన్న అనౌన్స్ చేసిన నందమూరి మోక్షజ్ఞ డెబ్యూ సినిమాకి దర్శకుడిగా లాక్ చేయడంతో అభిమానులు హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే ఇతని మొదటి మూవీ బింబిసార తీసింది కూడా నందమూరి హీరోతోనే. కాకపోతే తన మీద రాబోయే రోజుల్లో చాలా పెద్ద ఒత్తిడి నెలకొననుంది. ఎందుకంటే ఎంట్రీ బాగా ఆలస్యం కావడంతో మోక్షజ్ఞ మీద అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఫ్యాన్స్ తన నుంచి జూనియర్ ఎన్టీఆర్ ని మ్యాచ్ చేసే లేదా అతన్ని మించే మాస్ ఆశిస్తారు.

వాళ్ళను సంతృప్తి పరచడం పెద్ద ఛాలెంజ్. పైగా చిరంజీవి లాంటి స్టార్ హీరోతో విశ్వంభరని హ్యాండిల్ చేసిన విధానం వశిష్ఠ మీద పలు రకాల అభిప్రాయాలు వచ్చేలా చేసింది. ఆస్కార్ విజేత కీరవాణితో బెస్ట్ సాంగ్స్ రాబట్టుకోలేదనే కామెంట్ ఇప్పటికీ తిరుగుతోంది. రాములోరి మీద వచ్చిన ఒక్క పాట సోసోగానే ఉంది. రీ రికార్డింగ్ హరి గౌరాతో చేయిస్తుండగా ఒక స్పెషల్ సాంగ్ బీమ్స్ తో కంపోజ్ చేయించారు. ఇవన్నీ వశిష్ఠ నిర్ణయాలు అయినా కాకపోయినా ప్రాధమిక బాధ్యత తనదే.

విశ్వంభర ఎప్పుడు రిలీజైనా అది హిట్ కావడం చాలా కీలకం. ఒకవేళ ఏదైనా తేడా జరిగితే వశిష్ఠ మీద మరింత ప్రెజర్ పెరుగుతుంది. అసలే బాలయ్య చాలా పెద్ద బరువు పెట్టారు. నందమూరి వంశంలోని మూడో తరం కీలక వారసుడిని అప్పగించారు. రామ్ చరణ్, మహేష్ బాబు, ప్రభాస్ ని పరిచయం చేసింది బాగా సెటిలైన స్టార్ డైరెక్టర్లు. కానీ వశిష్ఠ ఇంకా వాళ్ళ స్థాయిలో లేరు. ఇప్పుడు అందుకోవడానికి మంచి ఛాన్స్ ఉంది. ఈ రెండింటితో హిట్టు కొట్టాలి.

ఇంకో అసలైన సవాల్ ఏంటంటే మోక్షజ్ఞ తెరంగేట్రం త్వరగా జరగలేదు. మూడు పదుల వయసులో ఎంట్రీ ఇస్తున్నాడు. సో తండ్రి లాగా వందల సినిమాలు చేసే ఛాన్స్ ఉండదు. యాభై అందుకోవడానికే ఇప్పుడున్న టయర్ 1 స్టార్లు కిందా మీద పడుతున్నారు. రెండు దశాబ్దాల కెరీర్ లో రామ్ చరణ్ చేసింది పదహారు సినిమాలే. సో మోక్షజ్ఞ పరుగులు పెట్టినా పెట్టకపోయినా వేసే ప్రతి అడుగు పర్ఫెక్ట్ గా ఉండాలి. ఆ లెగసి తొలి అడుగు వేయించే వశిష్ఠ ఎలాంటి మేజిక్ చేస్తారో చూడాలి.