మోహ‌న్ లాల్ సినిమాకు అధికార పార్టీ ఫండింగ్?

అధికారంలో ఉన్న ప్ర‌భుత్వాలు త‌మ‌కు అనుకూలంగా, త‌మ ఐడియాల‌జీకి అనుగుణంగా సినిమాలు తీయించుకోవ‌డం కొత్తేమీ కాదు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ప్ర‌యోజ‌నం చేకూర్చేలా గ‌త కొన్నేళ్ల‌లో చాలా సినిమాలే వ‌చ్చాయి. దురంధ‌ర్ సినిమాను కూడా చాలామంది ఈ జాబితాలోనే చేరుస్తారు. ఆదిత్య ధ‌ర్ ఆ సినిమాను ఎంత గొప్ప‌గా తీసిన‌ప్ప‌టికీ.. ఇందులో ప‌రోక్షంగా మోడీ ప్ర‌భుత్వానికి ఎలివేష‌న్ ఇచ్చే సీన్స్ ఉన్నాయ‌న్న‌ది వాస్త‌వం. ఇప్పుడు మోహ‌న్ లాల్ హీరోగా ప్ర‌క‌టించిన కొత్త సినిమా ఆప‌రేష‌న్ గంగాను కూడా మోడీ ప్ర‌భుత్వం కోసం రూపొందిస్తున్న ప్రాప‌గండా మూవీగా ముద్ర వేస్తున్నారు ఒక వ‌ర్గం నెటిజ‌న్లు.

ర‌ష్యాతో యుద్ధం నేప‌థ్యంలో ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన వేలాది మంది భార‌తీయ విద్యార్థులు, పౌరుల‌ను ఇండియాకు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్ర‌భుత్వం ఆప‌రేష‌న్ గంగా పేరుతో రెస్క్యూ చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ ఆప‌రేష‌న్ నేప‌థ్యంగానే అదే పేరుతో మోహ‌న్ లాల్ హీరోగా సినిమా అనౌన్స్ చేశారు. కేంద్ర ప్ర‌భుత్వం చేసింది గొప్ప ప‌నే అయిన‌ప్ప‌టికీ.. దాని మీద సినిమా అనౌన్స్ చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అందులోనూ మోహ‌న్ లాల్ లాంటి టాప్ హీరో ఇందులో లీడ్ రోల్ చేయ‌నుండ‌డంతో సోష‌ల్ మీడియాలో ఆయ‌న్ని టార్గెట్ చేసుకున్నారు.

మోడీ స‌ర్కారును మెప్పించ‌డానికే ఆయ‌నీ సినిమా చేస్తున్నాడ‌ని.. క‌చ్చితంగా దీని వెనుక సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ ఫండింగ్ ఉంటుంద‌ని అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. ఎంచుకున్న క‌థాంశం మంచిదే అయినా.. ఎగ్జాజ‌రేష‌న్లు జోడించి, కేంద్ర ప్ర‌భుత్వం ఘ‌న‌త‌ను ఎక్కువ చేసి చూపిస్తూ ఈ సినిమా తీస్తారంటూ ముందే విశ్లేష‌ణ‌లు చేస్తున్నారు. అయితే ఇలాంటి సంఘటనలపై సినిమాలు రావడం ఇదేమీ కొత్త కాదని, దేశ చరిత్రలోని గొప్ప సంఘటనలపై సినిమా తీస్తుంటే మద్దతు ఇవ్వాల్సింది పోయి ఇటువంటి రాజకీయాల్లోకి సినిమాను లాగడం సరికాదని సినీప్రియలు చెబుతున్నారు.

త‌న తొలి చిత్రం మెప్ప‌డియాన్‌తో బెస్ట్ డెబ్యూ డైరెక్ట‌ర్‌గా నేష‌న‌ల్ అవార్డు అందుకున్న విష్ణు మోహ‌న్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండ‌గా.. బాలీవుడ్ న‌టులు అర్జున్ రాంపాల్, టాలీవుడ్ హీరోయిన్ భాగ్య‌శ్రీ బోర్సే, త‌మిళ సీనియ‌ర్ న‌టుడు పార్తీబ‌న్ ఇందులో ముఖ్య‌పాత్ర‌లు పోషించ‌నున్నారు.