అన్న రాలేదు.. వదినమ్మ ఒక్కరే ఎందుకు?

విజయ్ దేవరకొండ.. తమ్ముడి కెరీర్ మొదట్లో సినిమాలకు తనవంతు పుష్ ఇచ్చాడు. కానీ ఆనంద్‌కు సొంతంగా పేరు రావడం మొదలయ్యాక ప్రతి సినిమా దగ్గర విజయ్ కనిపించే పరిస్థితి లేదు. అన్న ఎప్పుడూ పక్కనే ఉంటే ఓవర్ షాడో ఎక్కువయ్యే అవకాశం లేకపోలేదు. ‘ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్’ ట్రైలర్ లాంచ్‌లో విజయ్ లేకపోవడం అందుకే పెద్ద ఆశ్చర్యం కాదు.

కానీ అక్కడ రష్మిక కనిపించడం మాత్రం వెంటనే నోటీస్ అయింది. పెళ్లి తర్వాత ఆనంద్ సినిమా వేడుకకు వదినగా ఆమె రావడం ఇదే మొదటిసారి. పైగా కొన్ని నెలల కిందట ‘ఎపిక్’ టీజర్ లాంచ్‌లోనే ట్రైలర్ ఈవెంట్‌కు వదినమ్మను పిలుస్తానని ఆనంద్ సరదాగా చెప్పాడు. అప్పట్లో చెప్పిన మాట ఇప్పుడు నిజంగానే స్టేజ్ వరకు వచ్చింది.

ఇక్కడ ఇంకో లెక్క కూడా ఉంది. విజయ్, రష్మిక ఇద్దరూ కలిసి వచ్చి ఉంటే ఈవెంట్ టోన్ మొత్తం మారిపోయేది. పెళ్లి తర్వాత ఇద్దరూ ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే మీడియా ఫోకస్ వాళ్ల మీదకే వెళ్లేది. ట్రైలర్ ఎలా ఉంది, ఆనంద్ ఏం మాట్లాడాడు, వైష్ణవి ఏం చెప్పింది అన్నదానికంటే దేవరకొండ ఫ్యామిలీ ఫొటోలే ఎక్కువగా తిరిగేవి. ఒక్క రష్మిక రావడంతో ఆ హంగామా అంతగా రాలేదు.

ఆనంద్‌కు ఇప్పుడు అన్న పుష్ తప్పనిసరి కూడా కాదు. ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’తో గుర్తింపు వచ్చింది. ‘బేబీ’తో వంద కోట్ల సినిమా కూడా చూశాడు. ఇప్పుడు ‘ఎపిక్’కు తన కాంబినేషన్, దర్శకుడు ఆదిత్య హాసన్, ‘బేబీ’ తర్వాత వైష్ణవితో మళ్లీ జోడీ అన్న పాయింట్లు ఉన్నాయి. ఇలాంటి టైమ్‌లో ప్రతి ఈవెంట్‌కు విజయ్ రావడం ఆనంద్‌కే ఓవర్ కేరింగ్‌లా కనిపించే ఛాన్స్ ఉంటుంది.

ఇక ఆనంద్‌తో ఉన్న ఫ్యామిలీ బాండింగ్, ముందే ఇచ్చిన మాట ఇవే ఆమె రాకకు సరిపోయే కారణాలు. ఇక ‘రణబలి’ ప్రమోషన్స్ మొదలైతే విజయ్, రష్మిక కలిసి కనిపించే సందర్భాలు ఎలాగూ వస్తాయి. అప్పుడు ఇద్దరూ ఒకే ఫ్రేమ్‌లో ఉంటే ఆ బజ్ వేరు. పెళ్లి తరువాత మొదటిసారి ఒక వేడుకలో పాల్గొంటే మళ్ళీ ట్రెండింగ్ లోకి వస్తారు. అందుకే ‘ఎపిక్’ స్టేజ్‌ను కూడా అన్న, వదిన జంట షోగా మార్చకుండా ఉండటం బెటర్ అయింది.