జడల్ విలన్లని సరిగా వాడుకోవాలి

ఇంకో 22 రోజుల్లో ప్యారడైజ్ ఆగమనం జరగనుంది. వచ్చే వారం ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలుపెట్టనుండగా తెలుగు రాష్ట్రాల్లో జీవోలు, టికెట్ రేట్ల పెంపుకి సంబందించిన వ్యవహారాలు కాస్త త్వరగానే చూసుకుంటారని టాక్. యుఎస్ లో అనిరుధ్ రవిచందర్ చేసిన లైవ్ కన్సర్టులు సినిమా హైప్ కి బాగా ఉపయోగపడుతున్నాయి. ముఖ్యంగా ఆయా షేర్, యెషనాగుల కట్ట మీద పాటలు ఒకదాన్ని మించి మరొకటి ఛార్ట్ బస్టర్ కావడంతో మాస్ ప్రేక్షకుల అంచనాలు ఓ రేంజ్ లో పెరిగిపోయాయి.

ఇదిలా ఉండగా ప్యారడైజ్ ప్రమోషన్లు వీలైనంత త్వరగా ఊపందుకోవాలి. కంటెంట్ లో ఎంత డెప్త్ ఉన్నా, ఎంత బాగా తీసినా వాటిని సరైన రీతిలో జనంలోకి తీసుకెళ్లాలి. అప్పుడే ఓపెనింగ్స్ ఇంకాస్త భారీగా వస్తాయి. జడల్ పాత్రలో నాని ఎంత టెర్రిఫిక్ గా నటించినా ఆ క్యారెక్టర్ ఎలివేట్ అయ్యేది ఖచ్చితంగా విలన్ల వల్లే. వాటిని ఎవరో ఆషామాషీ నటులు పోషించలేదు. ముఖ్యంగా మోహన్ బాబు లాంటి సీనియర్ ని తీసుకొచ్చి దర్శకుడు శ్రీకాంత్ ఓదెల పెద్ద అడ్వాంటేజ్ తీసుకున్నారు.

కిల్ ఫేమ్ రాఘవ్ జుయెల్ ఆయన కొడుకుగా మరో ఇంటెన్స్ విలన్ గా కనిపించనున్నాడు. వీళ్ళను పబ్లిసిటీలో భాగం చేసుకుంటే నార్త్ లోనూ బజ్ వస్తుంది. జయకృష్ణ డెబ్యూ శ్రీనివాస మంగాపురం విషయంలో మోహన్ బాబు అసలేం పట్టన్నట్టు ప్రచార పర్వానికి దూరంగా ఉన్నారు. కనీసం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రాలేదు. ఇంటర్వ్యూల సంగతి సరేసరి. కానీ ప్యారడైజ్ కేసు వేరు. భారీ బడ్జెట్ ముడిపడిన ఇలాంటి యాక్షన్ గ్రాండియర్ ప్రచారానికి నటీనటుల మద్దతు తప్పనిసరి.

టైం చాలా తక్కువగా ఉండటంతో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల చివరి దశ పనులను పరుగులు పెట్టిస్తున్నారు. ఇప్పటికే పలు వాయిదాలు పడిన ప్యారడైజ్ ఓపెనింగ్స్ పరంగా 2026 బెస్ట్ లో ఒకటిగా నిలుస్తుందని ట్రేడ్ అంచనా వేస్తోంది. అందులోనూ ఊర నాటు మాస్ సినిమా ఈ ఏడాదిలో రాలేదు. మన శంకరవరప్రసాద్ గారు, లెనిన్, పెద్ది ఎంత విజయం సాధించినా వాటిలో ఇంటెన్సిటీ తక్కువ. కానీ ప్యారడైజ్ అన్ని హద్దులు దాటబోతోంది. కంటెంట్ ప్లస్ ప్రెజెంటేషన్ లో కూడా.