సినిమా షూటింగ్ లో భాగంగా ఆర్టిస్టులు కొన్నిసార్లు రిస్కీ స్టంట్లు చెయ్యాల్సి ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే కొన్నిసార్లు ప్రమాదాలు జరుగుతుంటాయి. నటీనటులు తీవ్రంగా గాయపడుతుంటారు. ఈ క్రమంలో ప్రాణాలు కోల్పోయిన వాళ్లు కూడా ఉన్నారు. తమిళంలో తాను నటించిన కొత్త సినిమా మండాడి చిత్రీకరణ సందర్భంగా మామూలు రిస్కులు చెయ్యలేదని.. తనతో పాటు ఈ సినిమా యూనిట్లో చాలామంది నాలుగైదు సార్లు చావుకు దగ్గరగా వెళ్ళామని అంటున్నాడు సుహాస్.
మండాడి సినిమాలో కమెడియన్ టర్న్డ్ హీరో సూరి లీడ్ రోల్ చెయ్యగా.. సుహాస్ విలన్ పాత్ర చేశాడు. ఈ సినిమాలో తన లుక్ చూసి అందరూ షాక్ అయిపోయారు. అంత రగ్డ్, వైల్డ్ లుక్ లో కనిపిస్తున్నాడు సుహాస్. ఈ పాత్ర తన కెరీర్లో ఒక మైలురాయిలా నిలిచిపోతుందని.. తమిళంలోకి మంచి ఎంట్రీ ఇస్తుందని ఆశిస్తున్నాడు సుహాస్.
మండాడి సముద్ర నేపథ్యంలో సాగే థ్రిల్లర్ మూవీ. ఐతే మామూలుగా ఇలాంటి సినిమాలకు సెట్ వేసి, సీజీ సాయంతో షూట్ చేసి.. సముద్రంలో సన్నివేశాలు నడుస్తున్న ఫీలింగ్ కలిగిస్తారు. కానీ మండాడి టీం మాత్రం నిజంగా సముద్రంలోనే ముఖ్య సన్నివేశాలన్నీ తీసింది. ఈ సందర్భంగా బోటు తిరగబడి కొందరు తృటిలో ప్రాణాలతో బయటపడడం.. కెమెరాలు మునిగిపోవడం గమనార్హం. సముద్రంలో షూటింగ్ మరీ రిస్కీగా అనిపించిందని.. ప్రాణాలకు ముప్పు వాటిల్లే పరిస్థితి రావడంతో ఇకపై ఇలాంటి సినిమాలు చేయకూడదనే నిర్ణయానికి వచ్చినట్లు సుహాస్ చెప్పాడు.
“మండాడి క్లైమాక్స్ పోర్షన్ 45 రోజుల పాటు మొత్తం సముద్రంలోనే తీశారు. ఆ టైంలో బోట్లు తిరగబడడం లాంటి ఘటనల్లో నాలుగైదు సార్లు ఆల్మోస్ట్ చనిపోయే పరిస్థితి వచ్చింది. ఒకసారి అయితే ఇక అయిపోయాం అనుకున్నాం. పొద్దున్న సముద్రం మీదకి వెళితే సాయంత్రానికి తిరిగివచ్చే వాళ్ళం. ఇక పై ఇలాంటి లైఫ్ రిస్క్ చేసే సినిమాలు చెయ్యను” అని సుహాస్ చెప్పాడు. మదిమారన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా తమిళ, తెలుగు భాషల్లో ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates
