విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలయికలో రూపొందుతున్న రణబాలి కొత్త విడుదల తేదీ వచ్చేసింది. అక్టోబర్ 16 ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నట్టు మైత్రి సంస్థ అధికారికంగా ప్రకటించింది. టాక్సీవాలా, శ్యామ్ సింగ రాయ్ ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ప్యాన్ ఇండియా మూవీ వాస్తవానికి సెప్టెంబర్ 11 రావాల్సింది. అయితే షూటింగ్ ఆలస్యం, రష్మికకు మరో సినిమాలో గాయం కావడం లాంటి కారణాలు వాయిదాకు దారి తీశాయి.
దీని వెనుక ఒక ఆసక్తికరమైన స్ట్రాటజీ ఉంది. ప్రస్తుతానికి దసరా పండగని లక్ష్యంగా చేసుకున్న సినిమా జైలర్ 2 ఒకటే. అది కూడా కన్ఫర్మ్ గా వస్తుందా రాదానే దాని మీద చెన్నై వర్గాల్లో అనుమానాలు లేకపోలేదు. సన్ పిక్చర్స్ అయితే అక్టోబర్ 15 అనే చెబుతోంది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 2 రావాల్సిన వెంకటేష్ ఆదర్శ కుటుంబం ఏకె ఫార్టీ సెవెన్ ఇంకా పనులు పెండింగ్ ఉండటం వల్ల డేట్ మార్చుకునే ఆలోచనలో ఉన్నట్టు మొన్నటి నుంచే ప్రచారం ఊపందుకుంది. కానీ డిక్లేర్ చేయలేదు.
ఇలా ఎవరో స్లాట్ బుక్ చేసుకునేలా ఉన్నారని భావించి రణబాలి బృందం వెంటనే తమ డెసిషన్ చెప్పేసింది. నిఖిల్ స్వయంభు విడుదల ప్రకటన ఇవాళో రేపో వస్తుందని వినిపిస్తున్న సమయంలో విజయ్ దేవరకొండ బృందం అలెర్ట్ కావడం ఒకరకంగా మంచి నిర్ణయమే. ఎందుకంటే దసరా కీలకమైన సీజన్. రణబాలి వచ్చే రోజు నుంచి లెక్కేసుకుని చూసినా వరసగా అయిదు రోజులు సెలవులు ఉన్నాయి. ఓపెనింగ్ వసూళ్ళలో హాలిడేస్ బాగా దోహదం చేస్తాయి.
ఒకవేళ ఇంకో సినిమా ఏదైనా పోటీలో వచ్చినా పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. ఎందుకంటే దసరా కూడా ఈజీగా రెండు మూడు సినిమాలను అకామడేట్ చేస్తుంది. కాకపోతే పాజిటివ్ టాక్ తెచ్చుకోవాలి. నవంబర్ లో రామాయణ, డిసెంబర్ లో ఫౌజీ లాంటి ప్యాన్ ఇండియా సినిమాలు చాలా ఉన్నాయి కనుక రణబాలి ముందే వచ్చేయడం మంచి నిర్ణయం. స్వాతంత్రం రాకముందు రాయలసీమలో జరిగిన నిజ జీవిత ఘటనల ఆధారంగా రణబాలి చాలా ఇంటెన్స్ డ్రామాగా రూపొందుతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates