సంక్రాంతి థియేటర్ల కోసం యుద్ధాలు చేయాలేమో  

ఇంకా నాలుగు నెలలు ఉండగానే 2027 సంక్రాంతి గురించి ఇండస్ట్రీ వర్గాలు, డిస్ట్రిబ్యూటర్లలో విపరీతమైన చర్చలు మొదలయ్యాయి. నేనంటే నేనంటూ ఒక్కొక్కరు పండక్కు రావాలని పంతం పూనడంతో అసలు అన్ని థియేటర్లు ఎలా సరిపోతాయనే ఆందోళన నిర్మాతల్లో మొదలయ్యింది. ఈ కారణంగానే శర్వానంద్ నారి నారి నడుమ మురారికి మంచి టాక్ వచ్చినా భారీ రెవిన్యూ తేలేకపోయింది. రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి ఓపెనింగ్స్ కోసం పోరాడాల్సి వచ్చింది.  

రాబోయే పండక్కు వెంకటేష్ కళ్యాణ్ రామ్ ‘జనవరి 12 విడుదల’ ఎలాంటి మార్పు లేకుండా చెప్పిన తేదీకే వచ్చి తీరుతుంది. అనిల్ రావిపూడి రాజీ పడే సమస్యే ఉండదు. చిరంజీవి ‘కాకా’ ఆ మరుసటి రోజు వచ్చేస్తుంది. దర్శకుడు బాబీ కొల్లి పక్కా హామీ ఇవ్వడంతో కెవిఎన్ సంస్థ టీజర్ లోనే డేట్ చెప్పేసింది. వీటికన్నా ముందు ప్రశాంత్ వర్మ నిర్మాతగా రూపొందిన ‘మహాకాళి’ జనవరి 8 రానుండగా, సాయి దుర్గ తేజ్ ‘సంబరాల ఏటిగట్టు’ జనవరి 12 దిగుతున్నట్టు అనౌన్స్ మెంట్ ఇచ్చింది.

శర్వానంద్ ‘జార్జ్ క్రిష్’ జనవరి 14 అని పూజా కార్యక్రమాల రోజే చెప్పేసింది. అదే రోజు రవితేజ శ్రీవిష్ణు కాంబోతో హసిత్ గోలి దర్శకత్వంలో రూపొందే ‘దాగుడుమూతల దండాకోర్ (ప్రచారంలో ఉన్న టైటిల్)’ కూడా రిలీజ్ చేయాలని నిర్మాత దిల్ రాజు ప్రాధమికంగా నిర్ణయించుకున్నారట. రజినీకాంత్ ‘ధర్మన్’ పొంగల్ బరిలో దింపితే వచ్చే భారీ లాభాలను దృష్టిలో పెట్టుకుని నిర్మాత కమల్ హాసన్ ఇంకొద్ది రోజుల్లో దానికి సంబంధించిన నిర్ణయం తీసుకుంటారని తెలిసింది.

ఎంత సంక్రాంతి సీజన్ కీలకమే అయినా మరీ ఇలా ఏడెనిమిది సినిమాలు క్యూ కడితే చాలా కష్టం. ఎందుకంటే అయిదారు స్క్రీన్లు మాత్రమే ఉండే బిసి సెంటర్లు ఏపీ తెలంగాణలో చాలా ఉన్నాయి. వాటిలో ఇవన్నీ సర్దుబాటు చేయడం కష్టం. అందులోనూ దాదాపు అన్నీ కమర్షియల్ మాస్ ఎంటర్ టైనర్లే. ఒకటి రెండు సీరియస్ జానర్ ఉన్నప్పటికీ వరల్డ్ బిల్డింగ్ కాన్సెప్ట్ కాబట్టి జనాల్లో హైప్ తీసుకు రావొచ్చు. చూడాలి మరి ఎవరెవరు మాట మీద ఉంటారో ఎవరెవరు తప్పుకుంటారో.