మాజీ మంత్రి మల్లారెడ్డి స్టేజ్ ఎక్కారంటే, మైక్ అందుకున్నారు అంటే మెరుపులు మెరవాల్సిందే. అది రాజకీయ సభ అయినా.. సినిమా ఈవెంట్ అయినా.. మల్లారెడ్డి వీర ఉత్సాహంతో మాట్లాడుతూ సభా ప్రాంగణాలు దద్దరిల్లిపోయేలా చేస్తుంటారు. సినిమా వాళ్లు ప్రమోషన్ కోసం మల్లారెడ్డి కళాశాలలో ఈవెంట్లు చేయడం మామూలే. గతంలో ఇక్కడ నిర్వహించిన యానిమల్ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్ బంపర్ హిట్ అయింది. అప్పుడు మల్లారెడ్డి ప్రసంగం వైరల్ అయింది.
ఇప్పుడు మరో పాన్ ఇండియా సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్కు మల్లారెడ్డి కళాశాల వేదికగా నిలిచింది. ఆ చిత్రమే.. టాక్సిక్. ఈ మూవీ ఈవెంట్లోనూ మల్లారెడ్డి సందడి చేశారు. తనదైన శైలిలో ప్రసంగించి మల్లారెడ్డి కళాశాల విద్యార్థులతో టాక్సిక్ టీం సభ్యులను కూడా నవ్వించారు.
ముందు యశ్ కింద ఉండగా ప్రసంగిస్తూ.. మీ టాక్సిక్ సినిమాకు పైసలే పైసలు అంటూ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు మల్లారెడ్డి. అంతే కాక యశ్ను ఒక ఫొటో కావాలని కూడా అడిగారాయన. అలా కాసేపు మాట్లాడి నిష్క్రమించిన మల్లారెడ్డి.. తర్వాత యశ్ సహా టాక్సిక్ టీం అంతా వేదిక మీదికి వచ్చాక మరోసారి మైక్ అందుకున్నారు. అప్పుడు వీరావేశంతో ఆయన ఊగిపోతూ మాట్లాడారు. తన విద్యార్థుల వయసు 18-22 ఏళ్ల మధ్యే అని అన్న మల్లారెడ్డి.. ఇండియాలో నీలాంటి హీరోనే లేడు, నీ సినిమా బ్లాక్ బస్టర్, నువ్వు బ్లాక్ బస్టర్ అంటూ అరిచి యశ్ను కంగారెత్తించాడు.
ప్రపంచంలో ఉన్న యూత్ అంతా మల్లారెడ్డి కాలేజీలోనే ఉన్నారని.. ఇక్కడ మెడికల్, ఇంజినీరింగ్.. ఇలా చాలా కాలేజీలున్నాయని మల్లారెడ్డి వ్యాఖ్యానించారు. తమ కాలేజీల్లో స్టూడెంట్స్ మామూలోళ్లు కాదని.. వాళ్లందరూ ఏఐలో నైపుణ్యం సాధించి ప్రపంచాన్ని ఏలుతారని ఆయన పేర్కొన్నారు. గీతు మోహన్ దాస్ దర్శకత్వంలో రూపొందిన టాక్సిక్ ఈ బుధవారం ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. వెంకట్.కె.నారాయణ నిర్మించిన ఈ చిత్రంలో కియారా అద్వానీ, నయనతార, రుక్మిణి వసంత్ కథానాయికలుగా నటించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates