బాక్సాఫీస్ వద్ద వీర విహారం చేస్తున్న ఇరుముడి ఎక్కడికి వెళ్తుందో ఎవరికి అంతు చిక్కడం లేదు. పాజిటివ్ టాక్ రావడంలో ఆశ్చర్యం లేదు కానీ రవితేజ కెరీర్ లోనే అతి పెద్ద నెంబర్లు వచ్చే దిశగా పరుగులు పెడుతున్న వైనం చూసి ట్రేడ్ వర్గాలు నివ్వెరపోతున్నాయి. కంటెంట్ ని కొంచెం తక్కువ అంచనా వేసి సరిపడా థియేటర్లు కేటాయించన కొన్ని ఏరియాల డిస్ట్రిబ్యూటర్లు అప్పటికప్పుడు వీకెండ్ కోసం స్క్రీన్లను పెంచే పరిస్థితి తలెత్తింది. అయినా సరే మెయిన్ సెంటర్స్ లో టికెట్లు దొరికే సిచువేషన్ లేదు.
అసలు ట్విస్టు మరొకటి ఉంది. నిజానికి దర్శకుడు శివ నిర్వాణ ముందు ఇరుముడిని వినిపించింది నాగ చైతన్యకట. స్టోరీ నచ్చింది కానీ ఏవేవో కారణాల వల్ల ముందుకు వెళ్ళలేదు. ఈలోగా వృషకర్మకు ఎక్కువ సమయం అవసరం కావడంతో చైతు పూర్తిగా దానికే అంకితమారిపోయాడు. మైత్రికి కమిట్ మెంట్ పెండింగ్ ఉన్న మాస్ రాజా తన దగ్గరికి వచ్చిన ఇరుముడిని ఓకే చేశాడు. అంతకు ముందు శివ నిర్వాణ సినిమా ఖుషి తీసింది కూడా మైత్రి మూవీ మేకర్స్ కావడం గమనించాల్సిన విషయం.
ఒకవేళ చైతు ఇరుముడిలో త్రినాధ్ పాత్ర చేసి ఉంటే ఎలా ఉండేదన్న ఆలోచన చేస్తే అంతగా నప్పదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈ క్యారెక్టర్ మధ్యవయసు దాటిపోయిన హీరోలకు బాగా సూట్ అవుతుంది. వాళ్ళైతేనే ఇంటెన్సిటీని ఎక్కువగా పలికిస్తారు. పైగా ముత్యాల పల్లకి లాంటి పాటలకు హుషారైన డాన్సులు కావాలి. రవితేజ ఎంత బాగా చేశాడో థియేటర్లో ఎంజాయ్ చేసిన ప్రేక్షకులను చూసి చెప్పొచ్చు. పైగా పదేళ్ల బిడ్డకు తండ్రిగా నాగ చైతన్య లాంటి హీరోలు అంతగా నప్పరు.
బియ్యపు గింజ మీద తినేవాళ్ల పేరు ఉంటుందన్నట్టు సినిమాలకు కూడా ఇది వర్తిస్తుంది. సక్సెస్ కోసం తపించిపోతున్న రవితేజకు ఇది రావడం, పెద్ద హిట్టు దిశగా దూసుకెళ్లడం విధి అనిపిస్తుంది. ఇలాంటివి గతంలో అందరు స్టార్ హీరోలకు జరిగాయి కానీ ఇరుముడి కేసు కొంచెం స్పెషల్ గా అనిపిస్తుంది. అయ్యప్ప దీవెన మాస్ రాజా వైపే ఉన్నట్టుంది. రవితేజకు ధమాకా తర్వాత మరో వంద కోట్ల గ్రాసర్ అయ్యే దిశగా ఇరుముడి పరుగులు పెడుతోంది. అంతకన్నా ఎక్కువే వచ్చినా ఆశ్చర్యం లేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates