టాలీవుడ్లో మంచి అభిరుచి ఉన్న దర్శకుల్లో క్రిష్ ఒకడు. దాదాపు రెండు దశాబ్దాల కెరీర్లో క్రిష్ ఎన్నడూ రొటీన్ సినిమా తీసింది లేదు. ప్రతిసారీ ఏదో ఒక కొత్తదనం పంచడానికే ప్రయత్నించాడు. కాకపోతే ఆయన కెరీర్లో కమర్షియల్ సక్సెస్లు తక్కువ. తనకు దర్శకుడిగా చాలా సినిమాలకు పేరొచ్చింది కానీ.. డబ్బులు రాబట్టిన చిత్రాలు తక్కువ. ఐతే ఈ మధ్య క్రిష్ పేరు కూడా చెడుతోంది.
‘యన్.టి.ఆర్’, ‘కొండపొలం’, ‘ఘాటీ’ చిత్రాలు ఏ రకంగానూ మెప్పించలేకపోయాయి. ఎన్నో అంచనాల మధ్య మొదలైన ‘హరిహర వీరమల్లు’ ఏమో మధ్యలో వేరే దర్శకుడి చేతిలోకి వెళ్లి ఎటూ కాకుండా పోయింది. గత ఏడాది వచ్చిన ‘ఘాటీ’ బాక్సాఫీస్ దగ్గర కనీస ప్రభావం కూడా చూపించకపోవడంతో క్రిష్ కెరీర్ భవితవ్యంపై ప్రశ్నలు తలెత్తాయి. తర్వాత క్రిష్ అసలు వార్తల్లో లేకుండా పోయాడు. ఐతే రెండు నెలల ముందే క్రిష్ కొత్త సినిమా గురించి ఒక వార్త బయటికి వచ్చింది.
అందరూ కొత్త వాళ్లతో క్రిష్ ఒక సినిమా చేస్తున్నాడని.. ఇది ఈశాన్య భారతం నేపథ్యంలో నడిచే కథ అని, షూటింగ్ కూడా అక్కడే చేస్తున్నారని అప్డేట్ వచ్చింది. ఆ తర్వాత మరే సమాచారం లేదు. ఇప్పుడు ఈ సినిమా డబ్బింగ్ దశలో ఉన్నట్లు కొత్త అప్డేట్ బయటికి రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అసలు ఎప్పుడు షూటింగ్ మొదలుపెట్టాడో, ఎప్పుడు పూర్తి చేశాడో కానీ.. సినిమా అప్పుడే పోస్ట్ ప్రొడక్షన్ దశలోకి వెళ్లిపోవడం షాకింగే. క్రిష్ ఎప్పుడూ షూటింగ్ విషయంలో హడావుడి చేయడు. సైలెంటుగానే పని చేసుకుపోతుంటాడు. తక్కువ రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేస్తాడు.
ఐతే ఈసారి కనీసం ఆయన సినిమాలో ఎవరు ముఖ్య పాత్రలు చేస్తున్నారో, జానరేంటో కూడా తెలియకుండానే సినిమా పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ మొదలుపెట్టేశారంటున్నారు. డబ్బింగ్ కూడా చేస్తున్నారంటే త్వరలోనే రిలీజ్ డేట్ ఉండొచ్చు. మరి ఈ సినిమా విశేషాలను క్రిష్ ఎప్పుడు పంచుకుంటాడో చూడాలి. ఈసారైనా క్రిష్ ఓ మంచి హిట్ కొట్టి ఉపశమనం పొందాలని, మళ్లీ ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ తరహాలో పెద్ద సినిమాలు చేయాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates

