బేబీ డబ్బులు ఇంకా రాలేదా?

తెలుగులో వచ్చిన చిన్న సినిమాల్లో అతి పెద్ద సంచలనాల్లో ‘బేబీ’ ఒకటి. వైష్ణవి చైతన్య, ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ లాంటి అప్ కమింగ్ ఆర్టిస్టులతో సాయి రాజేష్ రూపొందించిన ఈ చిత్రం 2023లో విడుదలై ఏకంగా వంద కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఐతే సినిమా అంత పెద్ద హిట్టయింది కానీ.. ఇప్పటికీ ఆ సినిమా తాలూకు డబ్బులు పూర్తిగా తమ చేతికి అందలేదని సాయి రాజేష్‌తో కలిసి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేసిన ఎస్కేఎన్ చెప్పడం విశేషం.

సాయి రాజేష్, ఎస్కేఎన్ కలిసి ఇప్పుడు కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీప్రియ జంటగా ‘చెన్నై లవ్ స్టోరీ’ చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ నెల 24న ఈ చిత్రం విడుదల కాబోతోంది. బుధవారం కిరణ్ అబ్బవరం పుట్టిన రోజును పురస్కరించుకుని ‘చెన్నై లవ్ స్టోరీ’ టీం మీడియాను కలిసింది. ఈ సందర్భంగా ఎస్కేఎన్ ‘బేబీ’ గురించి షాకింగ్ విషయం వెల్లడించాడు.

ఒక సినిమా సక్సెస్ అయినంత మాత్రాన నిర్మాత పూర్తి లాభం తనకు వెంటనే అందుతున్న గ్యారెంటీ లేదని ఎస్కేఎన్ అన్నాడు. ఒక సినిమా కలెక్షన్ల తాలూకు నంబర్స్ అన్నీ నిర్మాతకు చేరడానికి చాలా టైం పడుతుందని అతను చెప్పాడు. ‘బేబీ’ సినిమాకు సంబంధించి ఇంకా తమకు రావాల్సిన పేమెంట్లు చాలానే పెండింగ్ ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా ఎస్కేఎన్ వెల్లడించాడు.

సినిమా అంత పెద్ద హిట్టయినా, గీతా ఆర్ట్స్ లాంటి పెద్ద సంస్థ భాగస్వామ్యంలో సినిమాను రిలీజ్ చేసినా.. ఇంకా నిర్మాతలకు అందాల్సింది అందలేదు అంటే ఆశ్చర్యం కలగకమానదు. అలాంటపుడు ఇండస్ట్రీలో పెద్దగా నెట్‌వర్క్ లేని కొత్త నిర్మాతల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. బిజినెస్, కలెక్షన్ల విషయంలో పెద్ద పెద్ద నంబర్స్ అయితే మీడియాలో కనిపిస్తాయి కానీ.. రిలీజ్ ముంగిట డబ్బులు కట్టడం, విడుదల తర్వాత కలెక్షన్ల నుంచి నిర్మాతలకు రావాల్సిన వాటాను ఇవ్వడంలో న్యాయంగా వ్యవహరించరని ఎస్కేఎన్ మాటల్ని బట్టి అర్థమవుతోంది.