సంగీత ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తూ గాన కోకిల ఎస్ జానకి చివరి శ్వాస తీసుకున్నారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో ఉన్న జానకి గారు మైసూరులో చికిత్స తీసుకుంటూ కన్ను మూయడం సంగీత ప్రియులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆరు దశాబ్దాలకు పైగా అన్ని భాషల్లో సుమారు 50 వేలకు పైగా పాటలు పాడిన జానకి గొంతు పరిచయం లేని తెలుగు ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదు. ఆవిడతో పాట పాడించని సంగీత దర్శకుడు ఎవరని భూతద్దం పెట్టి వెతికినా సమాధానం దొరకదు.
1938 ఏప్రిల్ 13 గుంటూరు జిల్లా పల్లపట్ల గ్రామంలో జానకి గారు జన్మించారు. మూడు సంవత్సరాల వయసు నుంచే సంగీతం పట్ల ఆ చిన్నారికున్న అభిలాషను గుర్తించి తల్లితండ్రులు శ్రీరామమూర్తి, సత్యవతి ప్రోత్సహించారు. 19 వయసులో చెన్నైలోని ఏవిఎం స్టూడియోలో తన మొదటి పాటను రికార్డు చేశారు. ఆ సినిమా పేరు విదియన్ విలయట్టు. టి చలపతిరావు సంగీతం అందించారు. తెలుగులో ఎమ్మెల్యే చిత్రంతో స్వంత సీమలో అడుగు పెట్టారు. అక్కడి నుంచి వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేకపోయింది.
ఆరు దశాబ్దాల సుదీర్ఘ గాన ప్రయాణంలో జానకి గారు నాలుగుసార్లు జాతీయ పురస్కారం అందుకోగా వాటిలో వంశీ దర్శకత్వం వహించిన సితార సినిమా పాట ‘వెన్నెల్లో గోదారి అందం’ కూడా ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి పదిసార్లు నంది అవార్డులు అందుకున్నారు. ఉషాకిరణ్ మూవీస్ నిర్మించిన మౌన పోరాటంతో సంగీత దర్శకురాలిగా కూడా విజయం సాధించిడం జానకి గారి ప్రతిభకు మచ్చుతునక. ముప్పైకి పైగా వివిధ రాష్ట్ర పురస్కారాలు అందుకోవడం ఎవరికీ సాధ్యం కాని మైలురాయి.
జానకిగారి భర్త రామ్ ప్రసాద్ 1997లో కన్నుమూయగా వారి ఏకైక కుమారుడు మురళీకృష్ణ ఈ సంవత్సరం జనవరిలో చనిపోవడం వ్యక్తిగతంగా కుంగదీసింది. ఘంటసాల, సత్యం, ఇళయరాజా, ఏఆర్ రెహమాన్, కీరవాణి, రాజ్ కోటి, మణిశర్మ లాంటి ఎందరో సంగీత దర్శకులు తమకు జానకి గారు పాడటం అదృష్టంగా భావించేవారు. భౌతికంగా జానకిగారు దూరమైనా, రోజు వినిపించే పాటల్లో ఎప్పటికీ సజీవంగా ఉంటారు. ఆకాశం, భూమి, జానకి లాంటి గొప్పవారి గాత్రలకు మరణం ఉండదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates