దర్శకత్వాన్ని పంచుకుంటున్న లారెన్స్

రాఘవ లారెన్స్ అంటే మొదట స్టార్ కొరియోగ్రాఫర్. తర్వాత అతను నటుడిగా మారి కొన్ని సినిమాలు చేశాడు. అంత వరకు ఓకే కానీ.. లారెన్స్ దర్శకుడు కాబోతున్నట్లు వార్తలు వచ్చినపుడు అందరూ ఆశ్చర్యపోయారు. అందులోనూ అక్కినేని నాగార్జున లాంటి పెద్ద హీరో అతణ్ని తన సొంత నిర్మాణ సంస్థలో దర్శకుడిగా పరిచయం చేస్తుంటే షాకవ్వని వాళ్లు లేరు.

తన దర్శకత్వ ప్రతిభ గురించి సందేహించిన వాళ్లందరికీ ‘మాస్’ మూవీతో తిరుగులేని సమాధానం చెప్పాడు లారెన్స్. ఆ తర్వాత ‘కాంఛన’ సిరీస్‌తో లారెన్స్ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేశాడో తెలిసిందే. ఇప్పుడు తనే హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో ‘కాంఛన-4’ కూడా తీస్తున్నాడు లారెన్స్. ఇందులో పూజా హెగ్డే లాంటి స్టార్ హీరోయిన్ కథానాయికగా నటిస్తోంది. మరోవైపు లోకేష్ కనకరాజ్ ప్రొడక్షన్లో ‘బెంజ్’ అనే మరో క్రేజీ మూవీలో లారెన్స్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఇది కాకుండా సొంత బేనర్లో మరో సినిమాను అనౌన్స్ చేశాడు లారెన్స్. తన కెరీర్లో అది 30వ సినిమా కావడం విశేషం. ఈ చిత్రానికి సంబంధించి మరో పెద్ద విశేషం ఏంటంటే.. లారెన్స్ మరో దర్శకుడితో కలిసి ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడు. పుగళ్ అనే కొత్త దర్శకుడితో కలిసి అతను ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నాడు. ఇండస్ట్రీలో ఇద్దరు దర్శకులు కలిసి ఒక సినిమా తీయడం కొత్తేమీ కాదు.

తెలుగు వాళ్లయిన రాజ్-డీకే సహా కలిసి సినిమాలు చేసే దర్శకుల జాబితా పెద్దదే. కానీ సింగిల్‌గా దర్శకుడిగా చాలా సినిమాలు చేసి మంచి పేరు సంపాదించిన లారెన్స్.. ఇప్పుడిలా ఇంకొకరితో కలిసి సినిమా చేయడమే ఆశ్చర్యం కలిగించే విషయం. ప్రస్తుతం సౌత్ సినిమాలో సెన్సేషన్‌గా మారిన సాయి అభ్యంకర్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నాడు. ఈ సినిమా కాస్ట్ అండ్ క్రూకు సంబంధించి పూర్తి వివరాలతో పాటు టీజర్‌ను ఈ నెల 12న ప్రకటించనున్నారు. స్వీయ దర్శకత్వంలో ఎక్కువగా హార్రర్ కామెడీలు చేసే లారెన్స్.. మరో దర్శకుడితో కలిసి ఎలాంటి సినిమా తీస్తాడో చూడాలి.