‘సట్లజ్’ నిషేధం… అసలేం జరిగింది

థియేటర్లలో విడుదలయ్యే సినిమాలకు సెన్సార్ అడ్డంకులు రావడం సహజం. ఒక్కోసారి నెలలు సంవత్సరాల తరబడి రిలీజులు ఆగిపోతాయి. కానీ ఓటిటిలో వచ్చిన మూవీ కేవలం నలభై ఎనిమిది గంటల నిడివిలోనే నిషేదానికి గురి కావడం చాలా అరుదు. ప్రస్తుతం బాలీవుడ్ చిత్రం ‘సట్లజ్’ ఇదే పరిస్థితిని ఎదురుకుంటోంది. ఇటీవలే ఎలాంటి హడావిడి లేకుండా డిజిటల్ లోకి వచ్చిన సట్లజ్ విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్న టైంలో హఠాత్తుగా మాయం కావడం మూవీ లవర్స్ ని కలవరపెడుతోంది.

ఇలా ఎందుకు జరిగిందో అర్థం కావాలంటే కొంచెం లోతుల్లోకి వెళ్ళాలి. 1980 ముఖ్యంగా ఇందిరాగాంధీ హత్య తర్వాత పంజాబ్ రాష్ట్రంలో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నారంటూ కొన్ని వేల మందిని పోలీసులు చంపేశారు. వాళ్ళలో మిలిటెంట్లు, సామాన్య పౌరులు ఉన్నారు. అనుమానం వస్తే చాలు విచారణ లేకుండా ప్రాణాలు తీయడం పోలీసుల హక్కుగా మారిపోయింది. ఈ దమనకాండ మీద పోరాడిన వ్యక్తి జస్వంత్ సింగ్ ఖాల్రా. ఈయన సామజిక హక్కుల కార్యకర్తగా మారిన బ్యాంక్ ఉద్యోగి .

1995 వరకు జస్వంత్ సింగ్ ఎన్నో నిజాలను వెలికి తీసి ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టించారు. అదే సంవత్సరం సెప్టెంబర్ నెలలో ఆయన్ని కిడ్నాప్ చేసి హత్య చేయడం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. మృతదేహం దొరక్కుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. శవం లేకపోవడంతో కేసు ముందుకు కదల్లేదు. అంతర్జాతీయ సంస్థల ఒత్తిడి మేరకు సిబిఐ సంస్థ రంగంలోకి దిగాక అసలు దోషులు పట్టుబడ్డారు. 2007లో వాళ్లకు యావజ్జీవ కారాగార శిక్ష పడింది.

ఈ మొత్తం సంఘటనలను సట్లజ్ సినిమాలో తెరకెక్కించారు దర్శకుడు హనీ ట్రెహాన్. ముందు అనుకున్న టైటిల్ పంజాబ్ 95. సెన్సార్ బోర్డు అభ్యంతరం తెలపడంతో సట్లజ్ గా మార్చారు. చాలా కట్స్ చెప్పడంతో టీమ్ మూడు సంవత్సరాలు న్యాయ పోరాటం చేసింది. పరిష్కారం దొరక్కపోవడంతో ఓటిటి బాట పట్టింది. అక్కడా బ్రేకులు పడ్డాయి. హక్కులు పొందిన జీ5 సంస్థ ఇండియాలో మాత్రమే స్టీమింగ్ ఆపేసింది. మిగిలిన దేశాల్లో ఉన్న భారతీయులు చూసేయొచ్చు.