ప్రకాష్ రాజ్ కు కందుల దుర్గేశ్ వార్నింగ్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ పై చాలాకాలంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న యూట్యూబర్ ప్రశ్న రావణ్ అలియాస్ బచ్చలకూరి జోసెఫ్ పై ఏపీలో పలు చోట్ల పలు సెక్షన్ల కింద కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఒక కేసులో రావణ్ కు బెయిల్ దొరికిన వెంటనే మరో కేసులో ఆయనను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. దీంతో, రావణ్ కు మద్దతుగా సినీ నటుడు ప్రకాశ్ రాజ్ విమర్శలు గుప్పించారు.

కక్షపూరిత రాజకీయాలని ఆరోపిస్తూ ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ లపై విమర్శలు చేశారు. అంతేకాదు, రావణ్ పై దాడి చేసేందుకు జనసేన కార్యకర్తలు ప్రయత్నించడాన్ని కూడా ఆయన తప్పుబట్టారు. ప్రశ్నిస్తే చంపేస్తారా అని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే ప్రకాష్ రాజ్ కామెంట్లపై ఏపీ పర్యాటక శాఖ మంత్రి, జనసేన నేత కందుల దుర్గేశ్ స్పందించారు. కూటమి ప్రభుత్వంపై విషం చిమ్మడానికి తాడేపల్లి ప్యాలెస్ నుంచి ప్రకాష్ రాజ్ కు ప్రతి నెలా ఎంత అందుతోందో చెప్పాలని సంచలన వ్యాఖ్యలు చేశారు.

అంతేకాదు, ఏపీలో అశాంతిని, ఘర్షణ వాతావరణాన్ని రగిల్చేందుకు ఒక ముఠా కావాలనే ప్రయత్నిస్తోందని దుర్గేశ్ ఆరోపించారు. ప్రకాశ్ రాజ్, రావణ్‌ల లు సమాజ విద్రోహ శక్తులని విమర్శించారు. వివాదాస్పద యూట్యూబర్‌ రావణ్ తో ప్రకాశ్ రాజ్‌కు ఉన్న చీకటి సంబంధాలేంటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

వైసీపీ హయాంలో ఏపీలో ఎన్నో అకృత్యాలు జరిగాయని అప్పుడు లేవని ప్రకాశ్ రాజ్ గొంతు ఇప్పుడు ఎందుకు లేస్తోందని దుర్గేశ్ నిలదీశారు. లా అండ్ ఆర్డర్ ను డిస్టర్బ్ చేసేందుకు కుట్ర పన్నేవారిని ప్రభుత్వం కఠినంగా అణచివేస్తుందని వార్నింగ్ ఇచ్చారు.