శోభితకు సమంత పంచ్ వేసిందా?

టాలీవుడ్ హీరోయిన్లలో సమంత చాలా చాలా స్పెషల్ అని ఎవ్వరైనా ఒప్పుకోవాల్సిందే. విజయశాంతిలా, అనుష్కలా యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాలు చేయకపోయినా సరే.. వారికి దీటుగా ఫ్యాన్ ఫాలోయింగ్, ఇమేజ్ సంపాదించి హీరోయిన్లలో గొప్ప స్థాయిని అందుకుందామె. హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలతో మిడ్ రేంజ్ స్టార్లతో సమానంగా వసూళ్లు రాబట్టిన ఘనత ఆమె సొంతం. కానీ కెరీర్ గొప్పగా సాగుతున్న టైంలో వ్యక్తిగత జీవితంలో ఒడుదొడుకులు, ఆరోగ్య సమస్యలతో ఆమె ఎంత సతమతం అయిందో తెలిసిందే.

తర్వాత సినిమాలూ కొన్ని నిరాశపరిచి జీవితంలో అత్యంత కఠిన దశను ఎదుర్కొంది సామ్. నాగచైతన్యతో విడాకుల అనంతరం కొన్ని కారణాల వల్ల ఆమె సోషల్ మీడియా వ్యతిరేకతనూ ఎదుర్కొంది. కానీ ఒక ఫైటర్‌లాగా అన్ని సమస్యలను, వ్యతిరేకతనూ జయించి తిరిగి బలంగా నిలబడింది. తన ఆరోగ్య సమస్య తీరిపోయింది. రాజ్ నిడిమోరును పెళ్లి చేసుకుని తల్లి కూడా కాబోతోంది. అంతే కాక తన కొత్త చిత్రం ‘మా ఇంటి బంగారం’ పెద్ద హిట్టయింది.

ఈ సినిమా సక్సెస్ మీట్లో సమంత ఒకప్పట్లా ఎంతో సంతోషంగా కనిపించడం అభిమానులకు అత్యంత ఆనందాన్నిచ్చింది. ఈ కార్యక్రమంలో రిలేషన్‌షిప్స్ గురించి ఆమె చేసిన ఒక కామెంట్ నిన్నట్నుంచి చర్చనీయాంశం అవుతోంది. మన జీవితాలను ఇంకొకరు కంట్రోల్ చేయకూడదని చెబుతూ.. మనం మనంగానే సంపూర్ణం కావాలని, ఇంకొరు వచ్చి మన జీవితాన్ని కంప్లీట్ చేస్తారని ఆశించకూడదని వ్యాఖ్యానించింది సామ్.

మామూలుగా చేస్తే ఇది సింపుల్ కామెంట్ లాగే కనిపిస్తుంది. కానీ అందులో ఒక అంతరార్థం ఉందని, ఇందులో ఒక పంచ్ దాగుందని నెటిజన్లు విశ్లేషిస్తున్నారు. నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల పెళ్లి జరిగినపుడు రిలీజ్ చేసిన వీడియోలో శోభిత కామెంట్‌ను వాళ్లు గుర్తు చేస్తున్నారు.

అప్పుడు శోభిత.. తాను, చైతూ ఎవరికి వాళ్లం కంప్లీట్ పర్సన్సే అని.. కానీ అవతలి వ్యక్తి లేనపుడు ఇన్‌కంప్లీట్ అనిపిస్తామని.. తను కలిస్తేనే సంపూర్ణం అయినట్లు భావిస్తామని వ్యాఖ్యానించింది. కానీ ఇప్పుడు సమంత దానికి విరుద్ధమైన మాట చెప్పింది. మీకు మీరు కంప్లీట్ అవ్వాలి, ఇంకెవరో వచ్చి మనల్ని సంపూర్ణం చేస్తారని ఆశించకూడదు అంటూ నొక్కి వక్కాణించడంతో ఇది శోభితకు వేసిన పంచ్ అనే భావిస్తున్నారు.