రణబాలికి సర్దార్ టెన్షన్ ఉంటుందా

విజయ్ దేవరకొండ ప్యాన్ ఇండియా మూవీ రణబాలి సెప్టెంబర్ 11 విడుదల తేదీ ఎప్పుడో ఖరారు చేసుకుంది. అధికారిక ప్రకటన వచ్చి నెలలు దాటిపోయి అప్పుడప్పుడు ప్రమోషన్లు చేస్తున్నారు. ఒక లిరికల్ సాంగ్ మార్కెట్ లో ఉంది. సందర్భం దొరికానప్పుడల్లా ఏదో ఒక కంటెంట్ వదులుతూనే ఉన్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ భారీ చిత్రానికి శ్యామ్ సింగ రాయ్ ఫేమ్ రాహుల్ సంక్రుత్యాన్ దర్శకత్వం వహిస్తుండగా రష్మిక మందన్న హీరోయిన్.

ఇక్కడి దాకా బాగానే ఉంది కానీ సెప్టెంబర్ 10 సర్దార్ 2 రిలీజ్ చేయబోతున్నట్టు ఇవాళ ఉదయం అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. కార్తీ కెరీర్ బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా చెప్పుకునే ఈ స్పై థ్రిల్లర్ ఏపీ తెలంగాణలో కూడా బాగానే ఆడింది. ఖైదీ తర్వాత చెప్పుకోదగ్గ డబ్బులు తెచ్చింది ఈ సినిమానే. రెండు గెటప్స్ లో కార్తీ పెర్ఫార్మన్స్ తో పాటు మిత్రన్ డైరెక్షన్ జనాన్ని ఆకట్టుకుంది. ఒకదశలో ఇతను చిరంజీవి, చరణ్ లకు కథలు వినిపించే దాకా ప్రయత్నాలు చేశాడు.

ఇదిలా ఉండగా రణబాలి, సర్దార్ 2 మధ్య కేవలం ఒక్క రోజు గ్యాప్ ఉండటం ఎంతవరకు సేఫ్ అనేది ఇద్దరి ఫ్యాన్స్ మధ్య డిస్కషన్ గా మారింది. ఎందుకంటే ఇద్దరూ హిట్ కోసం మొహం వాచిపోయిన హీరోలు. ఈ ప్రోజెక్టుల మీద వాళ్ళ ఆశలు మాములుగా లేవు. బలమైన కంబ్యాక్స్ అవుతాయనే నమ్మకంతో కష్టపడి పని చేస్తున్నారు. అలాంటప్పుడు క్లాష్ అయితే తమిళంలో విజయ్ దేవరకొండకి, తెలుగులో కార్తీకి థియేటర్ షేరింగ్, పబ్లిక్ టాక్ లాంటి అంశాలు ఇబ్బందిగా మారతాయి.

ఇంకా మూడు నెలల సమయం ఉంది కాబట్టి నిజంగా ఈ ఫేస్ టు ఫేస్ జరుగుతుందా అనేది వేచి చూడాలి. రణబాలి షూటింగ్ కీలక దశకు చేరుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ కు ఎక్కువ సమయం డిమాండ్ చేసే కంటెంట్ ఇది. సో ఇంత గ్యాప్ లో అవన్నీ పూర్తి చేసి ప్రమోషన్లకు తగినంత సమయం పెట్టుకోగలరా అనేది వేచి చూడాలి. స్వాతంత్రం రాకముందు రాయలసీమలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా రణబాలిని తెరకెక్కించారు. వంద కోట్లపైనే ఖర్చయ్యిందని ఇన్ సైడ్ టాక్.