నాలుగేళ్ల ముందు వరకు రిషబ్ శెట్టి అంటే.. కన్నడకే పరిమితమైన ఒక నటుడు, దర్శకుడు. తన మార్కెట్ పరిధి చాలా చిన్నది. చిన్న, మిడ్ రేంజ్ సినిమాలు చేసుకునేవాడు. కానీ కాంతార అనే ఒక సినిమా తన కెరీర్ను పూర్తిగా మార్చేసింది. నిజానికి అది కూడా చిన్న సినిమానే. కానీ పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్గా నిలిచి ఏకంగా రూ.400 కోట్ల మేర కలెక్షన్లు రాబట్టడంతో రిషబ్ పేరు మార్మోగిపోయింది.
కాంతార తర్వాత హడావుడి పడకుండా టైం తీసుకుని చేసిన కాంతార-2 కూడా పెద్ద బ్లాక్ బస్టర్ కావడంతో రిషబ్ క్రేజ్ పీక్స్కు చేరుకుంది. ఇప్పుడు ఇండియాలోనే అత్యంత డిమాండ్ ఉన్న నటుల్లో అతనొకడు. తన మీద వందల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. ఆల్రెడీ తెలుగులో జై హనుమాన్ లాంటి భారీ చిత్రం చేస్తున్నాడు రిషబ్. దీని బడ్జెట్ రూ.200 కోట్ల పైమాటే అని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు దాన్ని మించిన భారీ చిత్రానికి రిషబ్ రెడీ అవుతున్నాడు.
రిషబ్ ప్రధాన పాత్రలో ఇప్పటికే ప్రకటించిన ఛత్రపతి శివాజీ సినిమా మీద ఏకంగా రూ.500 కోట్ల బడ్జెట్ పెట్టేందుకు నిర్మాతలు సిద్ధమవుతున్నారట. మరాఠా యోధుడు శివాజీ మీద ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. ఈ మధ్యే రితేశ్ దేశ్ముఖ్ సైతం స్వీయ దర్శకత్వంలో శివాజీ మీద సినిమా చేశాడు. దానికి ఒక మోస్తరు స్పందన వచ్చింది. ఐతే ఛత్రపతి కథను ఇంకా భారీగా, గొప్పగా తీయడానికి స్కోప్ ఉందన్నది చాలామంది నమ్మకం. ఆ నమ్మకంతోనే రిషబ్ చేసే శివాజీ సినిమాను రెండు భాగాలుగా తీయాలని, మొత్తంగా రూ.500 కోట్ల బడ్జెట్ పెట్టాలని మేకర్స్ ఫిక్సయ్యారు.
బాలీవుడ్ దర్శకుడు సందీప్ సింగ్ పాన్ ఇండియా స్థాయిలో రూపొందించే ఈ చిత్రాన్ని ఎమెంగో స్టూడియోస్, లెజెండ్ స్టూడియోస్ నిర్మించనున్నాయి. వచ్చే ఏడాది చిత్రీకరణ ఆరంభించి 2028లో పార్ట్-1ను, 2029లో పార్ట్-2ను రిలీజ్ చేయాలనిప్లాన్ చేస్తున్నారు. రిషబ్ కి ఉన్న క్రేజ్, మార్కెట్.. ఈ కథకు ఉన్న పోటెన్షియాలిటీ దృష్ట్యా ఈ సినిమాలను సరిగ్గా తీస్తే ఒక్కోటి వెయ్యి కోట్ల మేర బిజినెస్ చేస్తాయని ట్రేడ్ పండిట్లు అంచనా వేస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates