హిమాలయాలకు వెళ్లిపోవాలనుకున్న హీరోయిన్

కథానాయికగా పరిచయం అయింది తమిళంలోనే అయినా.. తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేసి గుర్తింపు సంపాదించింది నివేథా పెతురాజ్. మెంటల్ మదిలో, చిత్రలహరి, అల వైకుంఠపురములో, రెడ్, విరాటపర్వం, దాస్ కా ధమ్కీ.. ఇవీ ఆమె తెలుగులో నటించిన సినిమాలు. వీటిలో చాలా వరకు నివేథాకు మంచి గుర్తింపునే తెచ్చాయి.

ఐతే కెరీర్ బాగా సాగుతున్న టైంలోనే 2023లో రజిత్ అనే దుబాయ్ బేస్డ్ బిజినెస్‌మ్యాన్‌తో ఎంగేజ్మెంట్ చేసుకుని వ్యక్తిగత జీవితంలో స్థిరపడాలనుకుంది. ఈ సమయంలో సినిమాలకు కూడా తాను గుడ్‌బై చెప్పేస్తున్నట్లు కూడా ప్రకటించింది. ఐతే ఎంగేజ్ అయితే అయ్యారు కానీ.. వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోలేదు.

గత ఏడాది అనూహ్యంగా తన నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంటున్నట్లు నివేథా ప్రకటించింది. ఆ తర్వాత మళ్లీ నెమ్మదిగా సినిమాల్లో బిజీ అవుతోందామె. టాలీవుడ్ లేటెస్ట్ రిలీజ్ ‘సింగ్ గీతం’లో ఆమె ఒక కీలక పాత్ర చేసింది. దానికి మంచి స్పందన వస్తోంది.

‘సింగ్ గీతం’ సక్సెస్ మీట్లో నివేథా పెతురాజ్ మాట్లాడుతూ.. వ్యక్తిగత జీవితంలో జరిగిన కొన్ని పరిణామాల వల్ల తాను హిమాలయాలకు వెళ్లిపోవాలన్న ఆలోచన చేసినట్లు వెల్లడించడం విశేషం. జీవితం ఎప్పుడు ఎలాంటి మలుపు తీసుకుంటుందో తెలియదంటూ 2023లో సినిమాల నుంచి వీడ్కోలు తీసుకోవాలనుకున్న తాను.. సింగీతం శ్రీనివాసరావు లాంటి లెజెండ్ రూపొందించిన సినిమాలో భాగం కావడం ఊహించని విషయమని ఆమె చెప్పింది.

కొన్నిసార్లు జీవితంలో మనం చేసే తప్పులను కరెక్ట్ చేసుకునే అవకాశం లభిస్తుందని.. హిమాలయాలకు వెళ్లిపోవాలనుకున్న తాను ‘సింగ్ గీతం’ చిత్రంలో నటించాను అంటే.. అది కేవలం నాగ్ అశ్విన్ వల్లే అని ఆమె వ్యాఖ్యానించింది. తన ఆలోచన విధానాన్ని మార్చి, ఇలాంటి గొప్ప సినిమాలో భాగం అయ్యేలా చేసిన ఘనత తనదే అంటూ ఆమె కొనియాడింది.

సూటిగా విషయం చెప్పకపోయినా.. సినిమాలకు గుడ్ బై చెప్పి పెళ్లి చేసుకోవాలన్న తన నిర్ణయం తప్పని ఆమె చెప్పకనే చెప్పింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో నివేథా ఒక్కసారిగా బిజీ అయిపోయే సంకేతాలు కనిపిస్తున్నాయి. వెంకీ మూవీ ‘ఆదర్శ కుటుంబం’తో పాటు చిరు-బాబీ సినిమాలోనూ ఆమె నటిస్తుండడం విశేషం.