అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు

కొన్నేళ్ల గ్యాప్ త‌ర్వాత మొద‌లైన ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొత్త ఇన్నింగ్స్‌లో అభిమానుల ఆకాంక్ష‌లు, అంచ‌నాల‌కు త‌గ్గ సినిమాలు త‌క్కువే వ‌చ్చాయి. వాటిలో ఓజీ టాప్‌లో ఉంటుంద‌న‌డంలో సందేహం లేదు. ఆ సినిమా విడుద‌ల‌కు ముందు జ‌రిగిన హంగామా.. రిలీజ్ టైంలో నెల‌కొన్న సంద‌డి గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఏకంగా రూ.300 కోట్ల గ్రాస్ క‌లెక్ష‌న్ల‌తో ప‌వ‌న్ కెరీర్లో హైయెస్ట్ గ్రాస‌ర్‌గా నిలిచింది ఓజీ.

ఈ సినిమాకు సీక్వెల్ చేయాల‌ని అభిమానులు బ‌లంగా కోరుకుంటున్నారు. అందుకు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో పాటు ద‌ర్శ‌కుడు సుజీత్ కూడా సుముఖంగానే ఉన్న‌ట్లు క‌నిపించింది. కానీ ప‌వ‌న్ ఎంత బిజీనో తెలిసిందే కాబ‌ట్టి.. ఆ సినిమా సాధ్య‌మేనా, ఉంటే ఎప్పుడు ఉంటుంది అనే విష‌యంలో ఎవ‌రికీ క్లారిటీ లేదు. కొన్నేళ్ల త‌ర్వాతే ఈ సినిమాను ఆశించ‌వ‌చ్చనే అభిప్రాయంతో ఉన్నారు అభిమానులు కొన్ని రోజుల ముందు వ‌ర‌కు.

కానీ అనూహ్య ప‌రిణామాల మ‌ధ్యీ సినిమా అనుకున్న దాని కంటే ముందే మొద‌ల‌య్యే సంకేతాలు క‌నిపిస్తున్నాయి. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ప‌వ‌న్ చేయాల్సిన సినిమా ఆల‌స్యం అవుతోంది. మ‌రోవైపు నానితో సుజీత్ తీయాల‌నుకున్న బ్లడీ రోమియో ఎప్పుడు మొద‌ల‌వుతుందో స్ప‌ష్ట‌త లేదు. ఈ లోపు ఓజీ-2 స్క్రిప్టు పనులు పూర్తి చేసి పెట్టుకునే అవ‌కాశాల‌ను కొట్టి పారేయ‌లేం.

ఈ దిశ‌గా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్రొడ‌క్ష‌న్ హౌస్ పీకే క్రియేటివ్ వ‌ర్క్స్ ఎక్స్ పేజీలో హింట్ ఇవ్వ‌డం విశేషం. ప్రామిస్ చేసిన‌ట్లే ఓజాస్ గంభీర మ‌ళ్లీ రాబోతున్నాడంటూ ఎక్స్‌లో పోస్టు పెట్టారు ఈ హ్యాండిల్లో. సుజీత్ ఫారిన్లో ఉన్నాడ‌ని, అత‌ను రాగానే ఓజీ-2 అప్‌డేట్ ఎప్పుడ‌న్న‌ది తెలుస్తుంద‌ని ఈ పోస్టులో పేర్కొన్నారు.

ఓజీ2 అనే హ్యాష్ ట్యాగ్ మీద ఈ పోస్టు పెట్ట‌డంతో ప‌వ‌న్ అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. ఈసారి డీవీవీ దాన‌య్య బేన‌ర్లో కాకుండా పీపుల్ మీడియా సంస్థ‌లో ఓజీ సీక్వెల్ చేస్తార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఇందులో ప‌వ‌న్ సంస్థ పీకే క్రియేటివ్ వ‌ర్క్స్ కూడా నిర్మాణ భాగ‌స్వామిగా ఉంటుంద‌ని అంటున్న నేప‌థ్యంలో ఆ సంస్థ హ్యాండిల్లో ఇచ్చిన ఈ అప్‌డేట్ ప‌వ‌న్ ఫ్యాన్స్‌లో హుషారు నింపుతోంది.