తెలుగు IMAX కల నెరవేరుతోంది

ఒకప్పుడు హైదరాబాద్ మూవీ లవర్స్ కు హాట్ స్పాట్ గా ప్రసాద్ ఐమాక్స్ ఉండేది. అతి పెద్ద స్క్రీన్ తో ఒక డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వడంలో దానికదే సాటి. కానీ తర్వాత సాంకేతిక కారణాలతో పాటు లైసెన్స్ రెన్యూవల్ కాకపోవడం వల్ల ఐమాక్స్ తో ప్రసాద్ అనుబంధం తెగిపోయింది. అక్కడ నుంచి స్వంతంగా పీసీఎక్స్ పేరుతో భారీ తెరను యాజమాన్యం కొనసాగిస్తోంది. అయినా సరే ఐమాక్స్ అనుభూతి తమకు కావాలనేది మూవీ లవర్స్ సంవత్సరాలుగా చేస్తున్న డిమాండ్.

ఎట్టకేలకు వాళ్ళ కోరిక నెరవేరినట్టే కనిపిస్తోంది. ఏషియన్ సంస్థ ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టు సమాచారం. మా ప్రతినిధికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో డిస్ట్రిబ్యూటర్, నిర్మాత సునీల్ నారంగ్ ఆ దిశగా సంకేతాలు ఇవ్వడం సినీ ప్రియులకు హాట్ టాపిక్ గా మారింది. సౌత్ ఇండియాలో బిగ్గెస్ట్ రెవిన్యూ జనరేటర్ గా ఏపీ తెలంగాణలో ఇప్పటిదాకా ఐమాక్స్ లేకపోవడం విచిత్రం కాగా కేరళ, తమిళనాడు, కర్ణాటక ఈ విషయంలో ముందంజలో ఉండటం గమనించాల్సిన విషయం.

క్రమంగా భాగ్యనగరం బెస్ట్ మూవీ ఎక్స్ పీరియన్స్ కు వేదికా మారుతోంది. పిఎక్స్ఎల్, బార్కో, పీసీఎక్స్, డాల్బీ సినిమా, డాల్బీ ఎల్ఈడి అంటూ రకరకాల ఫార్మాట్లను తీసుకొస్తూ ఆడియన్స్ ని థ్రిల్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ముంబై లాంటి నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉండే ప్రీమియర్ సౌకర్యాలను అందిస్తున్నారు. ఇలా చేయడం వల్ల సింగల్ స్క్రీన్లు సైతం మెరుగైన క్వాలిటీ ఇవ్వడానికి పోటీ పడతాయని చెప్పడంలో సందేహం అక్కర్లేదు.

గతంలో సుదర్శన్ 70 ఎంఎం ఉన్న ప్రాంతంలో ఈ ఐమాక్స్ రావొచ్చని ప్రాధమిక అంచనా. వారంలోనే అనౌన్స్ మెంట్ కూడా రావొచ్చట. సురేష్ బాబు, మహేష్ బాబు భాగస్వామ్యం ఉంటుందని సమాచారం. అయితే టికెట్ రేట్ల విషయంలో గరిష్ట పరిమితి పద్ధతి ఫాలో అవుతున్న ఏపీ తెలంగాణలో ఐమాక్స్ లాంటివి మనుగడ సాగించాలంటే ప్రత్యేక వెసులుబాట్లు అవసరం. మరి ఆ దిశగా ప్రభుత్వాలు ఏమైనా చర్యలు తీసుకుంటాయేమో చూడాలి.