‘దృశ్యం-4’ వైపు లాగే భారీ వసూళ్లు

ఇండియన్ సినిమాలో ఫ్రాంఛైజీ సినిమాల్లో మూడుకు మించి వచ్చిన దాఖలాలు తక్కువ. మన దగ్గర హిట్ సినిమాల సీక్వెల్స్ బాగా ఆడడం తక్కువే. ఒక సినిమా ఆడినా సరే.. మూడోది వచ్చిందంటే ప్రేక్షకులకు మొహం మొత్తేస్తుంటుంది. ముందు సినిమా స్థాయిలో కంటెంట్ ఉండదు. ప్రేక్షకులకు కూడా మొనాటనస్ ఫీలింగ్ వచ్చి రెండో సినిమాకో, మూడో సినిమాకో దండం పెట్టేస్తుంటారు. దీంతో అక్కడితో బ్రేక్ పడిపోతుంటుంది.

ఐతే ‘దృశ్యం’ ఫ్రాంఛైజీలో మాత్రం రెండో సినిమా అద్భుత స్పందన తెచ్చుకుని, మూడో చిత్రానికి దారిచ్చింది. కానీ ఇటీవలే విడుదలైన ‘దృశ్యం-3’ మాత్రం కంటెంట్ పరంగా తీవ్రంగా నిరాశపరిచింది. ఈ సినిమా చూసిన ఏ ప్రేక్షకుడూ సంతృప్తి చెందలేదు. దృశ్యం, దృశ్యం-2 చిత్రాలకు ఇది దరిదాపుల్లో కూడా లేదనే విషయంలో ఏకాభిప్రాయం వ్యక్తమైంది. కానీ సీక్వెల్ హైప్ వల్ల ఈ సినిమాకు వసూళ్ల విషయంలో మాత్రం ఢోకా లేదు.

టాక్‌తో సంబంధం లేకుండా భారీ ఓపెనింగ్స్ రాబట్టిన ‘దృశ్యం-2’.. వీకెండ్ తర్వాత కూడా ఆగడం లేదు. డబ్బింగ్ వెర్షన్ పెద్దగా వర్కవుట్ కాలేదు కానీ మలయాళ వెర్షన్ మాత్రం అన్ని చోట్లా బాగా ఆడుతోంది. కేరళలో అయితే వీక్ డేస్‌లో కూడా సినిమాకు హౌస్ ఫుల్స్ పడుతున్నాయి. మోహన్ లాల్ స్టార్ పవర్‌కు తోడు దృశ్యం ఫ్రాంఛైజీకి ఉన్న వాల్యూ బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు చేస్తోంది. విదేశాల్లో కూడా ఈ సినిమా బాగా ఆడుతోంది.

విడుదలైన ఆరు రోజులకే ఈ చిత్రం రూ.200 కోట్ల గ్రాస్ వసూళ్ల మార్కును అందుకోవడం విశేషం. మలయాళంలో ఈ మార్కును అందుకున్న సినిమాలు పది కూడా లేవు. ఈ ఊపు చూస్తుంటే.. ‘దృశ్యం-3’ ఫుల్ రన్లో రూ.300 కోట్ల మార్కును కూడా అందుకుని, లోక పేరిట ఉన్న ఆల్ టైం హైయెస్ట్ గ్రాసర్ రికార్డును కూడా బద్దలు కొట్టే అవకాశాలు లేకపోలేదు. ఈ చిత్రం ఇంత పెద్ద హిట్ అయిన నేపథ్యంలో ‘దృశ్యం-4’కు రంగం సిద్ధమైనట్లే. మోహన్ లాల్, జీతు జోసెఫ్ ఆ దిశగా టెంప్ట్ కాకుండా ఎలా ఉండగలరు?