జేడీని క‌దిలించిన చిరంజీవి

రామ్ గోపాల్ వ‌ర్మ ప్ర‌భావం ఆయ‌న శిష్యుల మీద కూడా చాలానే ఉంటుంది. త‌మ రూటే సెప‌రేటు అన్న‌ట్లుగా ఉంటుంది వాళ్ల వ్య‌వ‌హారం. ఎమోష‌న్ల‌కు చాలా దూరంగా ఉన్న‌ట్లు క‌నిపిస్తారు. మామూలు జ‌నాల‌తో క‌ల‌వ‌డం.. అంద‌రిలా మాట్లాడ‌టం వాళ్ల‌లో క‌నిపించ‌దు. వ‌ర్మ ప్ర‌భావం అలా ఎక్కువ‌గా ఉన్న వాళ్ల‌లో జేడీ చ‌క్ర‌వ‌ర్తి ఒక‌డు. వ‌ర్మ ఐడియాల‌జీ, లైఫ్ స్టైల్‌ను అత‌ను అందిపుచ్చుకున్న‌ట్లు క‌నిపిస్తాడు. ఎమోష‌న్ లెస్ అనిపించే జేడీ.. మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి ఒక ఉద్వేగ‌భ‌రిత లేఖ రాయ‌డం విశేషం. క‌రోనా క్రైసిస్ ఛారిటీ పేరుతో చిరంజీవి చేప‌ట్టిన సేవా కార్య‌క్రమాల‌కు అత‌ను క‌దిలిపోయి ఈ లేఖ రాశాడు. జేడీ లాంటి వాడు ఇలా లేఖ రాయ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. ఇంత‌కీ ఆ లేఖ‌లో జేడీ ఏమన్నాడంటే..

ప్రియమైన చిరంజీవి నేను మీ అభిమానినే కానీ అనుచరుడిని కాను. ఎప్పట్నుంచో నేను మిమ్మల్ని నటుడిగా మాత్రమే ఇష్టపడేవాడ్ని. ఒకప్పుడు నా తోటి నటులంతా సాయంత్రం అయ్యే సరికి మీ దగ్గరికి వచ్చి సమయం గడపడానికి ఆసక్తి చూపించే వాళ్లు కానీ.. నాకెప్పుడూ మీ దగ్గరికి రావాలనే ఆలోచన కూడా రాలేదు. ఇది నేను మీకు బహిరంగంగా రాస్తున్న లేఖ కరోనా తీసుకొచ్చిన నష్టం మాటల్లో చెప్పలేం.. లాక్‌డౌన్ చేయడంతో సినిమా పరిశ్రమ కూడా ఎంతో కోల్పోయింది. మాటల్లో చెప్పలేనంతగా సినీ కార్మికులు నష్టపోయారు. ఈ ఆపత్కాలంలో ఇతరుల్ని ఆదుకోవడానికి మీరు ముందుకు రావడం అద్భుతం.

అభిమానులే కాదు అందరూ.. మిమ్మల్ని ఎందుకు అంతగా ఇష్టపడతారో నమ్ముతారనే దానికి మీరు ఇప్పుడు చేస్తున్న కరోనా క్రైసిస్ ఛారిటీ నిదర్శనం. మీరు నా దృష్టిలో మెగాస్టార్ కాదు అంతకంటే ఎక్కువ. చిరంజీవి గారు లేకపోయుంటే నిజంగానే ఆకలితో చచ్చిపోయేవాళ్లం. అందరి ఆకలి తీర్చారు అదంతా చిరంజీవి చలవే. మీకు అన్నం పెట్టిన పరిశ్రమకు ఇప్పుడు మీరు ఇలా రుణం తీర్చుకుంటున్నానని నాతో చెప్పారు. కానీ కార్మికుల పట్ల అది మీకున్న గౌరవం అని నేను భావిస్తున్నా. లాక్‌డౌన్ లేకపోతే ఇప్పటికిప్పుడు మిమ్మల్ని కలవడానికి వచ్చేవాడ్ని. ఓ మంచి వ్యక్తిగా ఎలా మారాలనే విషయాన్ని మీ దగ్గర నేర్చుకోవాలి అని జేడీ పేర్కొన్నాడు.