సల్మాన్ సినిమా @ 230 కోట్లు


కరోనా మహమ్మారి సినీ పరిశ్రమపై ఎంతగా ప్రభావం చూపించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దీని కారణంగా సినిమాల బిజినెస్‌ బాగా దెబ్బ తింది. నెలలకు నెలలు షూటింగ్స్ ఆగిపోయాయి. విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రాల్ని అలాగే పక్కన పెట్టాల్సి వచ్చింది. ఇటు ప్రొడక్షన్ హౌస్‌లు.. అటు డిస్ట్రిబ్యూషన్ సంస్థలు అన్నీ కూడా ఆర్థికంగా దెబ్బ తిన్నవే. ఈ నేపథ్యంలో ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించుకోవాల్సి రావడమే కాక.. సినిమాల బిజినెస్ కూడా ప్రభావితం అయ్యే పరిస్థితి వచ్చింది.

థియేటర్లలో సాధారణ పరిస్థితులు ఎప్పటికి వస్తాయో తెలియట్లేదు. ఇంకా ప్రేక్షకులు కూడా పూర్తి స్థాయిలో థియేటర్లకు రావట్లేదు. ఈ నేపథ్యంలో ఇంకా కొన్ని నెలల పాటు సినిమాలకు అనుకున్నంతగా బిజినెస్ జరగదని అంచనా వేస్తున్నారు. కానీ ఇలాంటి టైంలో సల్మాన్ ఖాన్ కొత్త సినిమా ‘రాధె’కు పలికిన రేటు బాలీవుడ్ ట్రేడ్ సర్కిల్స్‌లో సంచలనం రేపుతోంది.

సల్మాన్ హీరోగా ఆయన సొంత నిర్మాణ సంస్థలో ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాధె’. ఈ చిత్రానికి సంబంధించి హోల్ సేల్‌గా అన్ని హక్కులూ కలిపి రూ.230 కోట్లకు జీ స్టూడియోస్ కొనేసినట్లు సమాచారం. ముందు అయితే ఈ చిత్రాన్ని యశ్ రాజ్ ఫిలిమ్స్ ద్వారా రిలీజ్ చేయాలన్నది ప్రణాళిక. కమీషన్ బేసిస్ మీద ఆ చిత్రాన్ని యశ్ రాజ్ వాళ్లు రిలీజ్ చేసేలా ఒప్పందం కుదిరింది. కానీ కరోనా తర్వాత దూకుడు మీదున్న జీ స్టూడియోస్.. కొత్త సినిమాల థియేట్రికల్ హక్కులతో పాటు డిజిటల్ స్ట్రీమింగ్, శాటిలైట్ హక్కుల్ని ఒకేసారి కొనేస్తోంది.

తెలుగులో ‘సోలో బ్రతుకే సో బెటర్’ చిత్రాన్ని అలాగే సొంతం చేసుకుందా సంస్థ. ఈ సినిమా విషయంలో వాళ్ల ప్లాన్ సక్సెస్ కావడంతో సల్మాన్ సినిమాను ఇదే తరహాలో భారీ రేటు పెట్టి కొనేశారట. కొత్త ఏడాదిలో థియేటర్లు 100 శాతం నడవడం ఎప్పుడు మొదలవుతుందో అప్పుడు ముందుగా థియేటర్లలో రిలీజ్ చేసి, ఆ తర్వాత జీ5లో సినిమాను స్ట్రీమ్ చేస్తారు. ఆపై జీ ఛానెల్లో ప్రిమియర్స్ వేసుకుంటారట.