తారక్ అభిమానులు లైట్ తీసుకున్నారు

స్టార్ హీరోల ఫ్యాన్స్ ఎమోషన్స్ క్యాష్ చేసుకోవడానికి ఈ మధ్య డిస్ట్రిబ్యూటర్లు వాడుతున్న ఆయుధం రీ రిలీజులు. ఏదో కొత్త సినిమా రేంజ్ లో హడావిడి చేయించి ఇపుడున్న రెగ్యులర్ టికెట్ రేట్లతోనే వాళ్ళ భావోద్వేగాలతో వ్యాపారం చేయడం అనేది మాములు విషయంగా మారిపోయింది. ఎప్పుడో ఒకసారి అయితే బాగుంటుంది కానీ అదే పనిగా క్యూ కట్టి వదులుతుంటే ఎవరైనా ఏం చేస్తారు. ఈసారి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఈ తతంగాన్ని లైట్ తీసుకున్నారు.

రేపు తారక్ పుట్టినరోజు సందర్భంగా ఊసరవెల్లి, ఆంధ్రావాలా రెండూ రీ రిలీజ్ అవుతున్నాయి. వీటిలో ఒకటే ఫ్లాప్ కాగా రెండోది డిజాస్టర్. అయినా సరే ఏదోలా జనాన్ని రప్పిద్దామనే ఉద్దేశంతో ప్రచారం బాగానే చేశారు. కట్ చేస్తే అడ్వాన్స్ బుకింగ్స్ ఆశించిన స్థాయిలో లేవు. ఊసరవెల్లికి మెయిన్ సెంటర్స్ మార్నింగ్ షోలకు ఓ మోస్తరు అమ్మకాలు జరుగుతుండగా ఆంధ్రావాలాని పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. ఫ్యాన్స్ కు ఏ మాత్రం నచ్చని దారుణమైన మూవీ ఇది.

వాళ్ళ ధ్యాస మొత్తం ఎన్టీఆర్ నీల్ టీజర్ మీదే ఉంది. నాలుగు నిమిషాల వీడియోలో ఎంత విధ్వంసం చూపిస్తారోనని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఒకవేళ ఇది లేకపోయి ఉంటే ఊసరవెళ్లి మీద ఇంకొంచెం బెటర్ అటెన్షన్ వచ్చేదేమో కానీ కొత్త కంటెంట్ వస్తున్నప్పుడు పాతవి పట్టించుకోవడం కష్టమే. రేపు మొత్తం డ్రాగన్ తాలూకు హడావిడిలో సోషల్ మీడియా ఊగిపోయేలా ఉంది. క్లిక్ అయ్యిందా రోజు మొత్తం వాటి విజువల్స్ తో హోరెత్తిస్తారు.

డ్రాగన్ విడుదలకు ఇంకా ఏడాది సమయం ఉంది కాబట్టి అభిమానులకు సుదీర్ఘ నిరీక్షణ తప్పదు. అన్నీ అనుకున్న టైంలో జరిగి ఉంటే ఈ జూన్ కే రిలీజ్ అయ్యేది. టోవినో థామస్ తప్పుకోవడం, ఫారిన్ షెడ్యూల్స్ కొన్ని అనుకున్నట్టుగా జరగకపోవడం, అంతర్జాతీయ పరిస్థితులు లాంటి కారణాల వల్ల ఎప్పటికప్పుడు వాయిదాలు కొనసాగుతూనే వచ్చాయి. ఇవాళ వచ్చే టీజర్ సంవత్సరానికి సరిపడా ఎనర్జీ ఇవ్వాలి. ప్రశాంత్ నీల్ అంత ఏం వండాడో చూడాలి.