రాజీకి వస్తారా… రచ్చ చేస్తారా

ఎవరు ఔనన్నా కాదన్నా టాలీవుడ్ రెండు వర్గాలుగా విడిపోయింది. ఎగ్జిబిటర్లు ప్లస్ వాళ్లలోనే ఉన్న నిర్మాతలు, ప్రొడ్యూసర్లు ప్లస్ వాళ్లలోనే ఉన్న ఎగ్జిబిటర్లు ఇలా ఎవరికి వారు తమ తమ వెర్షన్లతో రోజుకో ప్రెస్ మీట్ పెడుతున్నారు. నాగవంశీ, సునిల్ నారంగ్, రవిశంకర్, సాహూ గారపాటితో పాటు ఇప్పటిదాకా కెమెరాకు అంతగా పరిచయం లేని థియేటర్ ఓనర్లు ఇప్పుడు తమ స్టేట్ మెంట్ల ద్వారా సోషల్ మీడియాలో వైరలవుతున్నారు. ఇది చాలా తీవ్ర స్థాయికి చేరుకున్న మాట వాస్తవం.

అందరూ కలిసి దీని మీద ఛాంబర్ మీటింగ్ చేయబోతున్నారు. అన్ని వర్గాల ప్రతినిధులు పాల్గొంటారు. పదిహేను ఈ మీటింగ్ జరగనుంది. అయితే పరిష్కారం దొరుకుతుందా అంటే అంత ఈజీ అయితే కాదు. ఇంకో దఫా చర్చలు అవసరం పడొచ్చు. రెండు వర్గాలు ఖచ్చితంగా రాజీ పడాలి. లేదంటే ఇంకా పెద్ద రచ్చ అవుతుంది. ఇప్పటికే పరువు వీధికెక్కిందని పలువురు సీనియర్లు బాధ పడుతున్నారు. సమస్యల నుంచి వ్యక్తిగత దూషణలకు వెళ్లడం మంచిది కాదంటున్నారు.

పెద్ది విడుదలకు ఇంకో పదిహేడు రోజులు మాత్రమే ఉంది. ప్రమోషన్లు క్రమంగా ఊపందుకోబోతున్నాయి. థియేటర్ అగ్రిమెంట్లు పెండింగ్ ఉన్నాయి. సింగల్ స్క్రీన్లు కావాలంటే తెలంగాణ ప్రదర్శకులు ఒక మెట్టు దిగాలి. లేదా నిర్మాతలు పర్సెంటెజ్ కి ఒప్పుకోవాలి. లేదంటే సమస్య ఇంకా తీవ్రం అవుతుంది. ఒక్క హైదరాబాద్ లోనే పాతిక దాకా సింగల్ స్క్రీన్లలో పెద్ది వేయకపోతే వచ్చే నష్టం ఫుల్ రన్ లో ఏడెనిమిది కోట్లకు పైనే ఉంటుంది.

ఇదంతా మెగా ఫ్యాన్స్ ని తీవ్ర అసహనానికి గురి చేస్తోంది. తమ హీరోల సినిమాలు వచ్చినప్పుడే ఇలా చేయడం పట్ల నిరసన వ్యక్తం చేస్తున్నారు. మాకు ఎవరూ టార్గెట్ కాదని ఎగ్జిబిటర్లు చెబుతున్నప్పటికీ సొల్యూషన్ దొరికే వరకు ఇది ఇలాగే నానుతూ ఉంటుంది. కొత్త సినిమాల హడావిడి ఏం లేకపోవడంతో ఈ ప్రెస్ మీట్ల తాలూకు వీడియోలతోనే సోషల్ మీడియా హ్యాండిల్స్ టైం పాస్ చేస్తున్నాయి. ఇంకెంత దూరం వెళ్తుందో ఎక్కడ ఆగుతుందో ఎవరికీ అంతు చిక్కడం లేదు.