ఆదిత్య ధర్.. గత నాలుగు నెలలుగా దేశవ్యాప్తంగా మార్మోగుతున్న పేరు. దురంధర్, దురంధర్-2 చిత్రాలతో అతను రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. పెద్దగా అంచనాలు లేకుండా రిలీజైన ‘దురంధర్’ ఏకంగా రూ.1400 కోట్ల వసూళ్లు రాబట్టగా.. దీనికి కొనసాగింపుగా వచ్చిన ‘దురంధర్-2’ అంతకుమించి కలెక్షన్లు రాబట్టి ఆల్ టైం రికార్డు దిశగా దూసుకెళ్తోంది. ‘దురంధర్’ ఆదిత్యకు దర్శకుడిగా రెండో సినిమా మాత్రమే కావడం విశేషం. అతడి తొలి చిత్రం ‘యురి’ కూడా పెద్ద హిట్టయింది. రూ.30 కోట్ల బడ్జెట్లో తెరకెక్కి, రూ.300 కోట్లు కలెక్ట్ చేసింది.
కేవలం మూడు చిత్రాలతో ఇండియన్ టాప్ డైరెక్టర్లలో ఒకడిగా ఎదిగిపోయాడు ఆదిత్య. ఐతే ఇప్పుడీ స్థాయిలో ఉన్న ఆదిత్య.. ఇండస్ట్రీలో అడుగు పెట్టాక చాలా ఏళ్ల పాటు అందరిలాగే నానా అవస్థలు పడ్డవాడే. దర్శకుడు కావడానికి పదేళ్లకు పైగానే పోరాడాడట ఆదిత్య. అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేసేటపుడు వచ్చే జీతం రూం రెంటుకు కూడా సరిపోని పరిస్థితుల్లో కడుపు నింపుకోవడం కోసం డైలాగులు, పాటలు రాయడం మొదలుపెట్టినట్లు అతను వెల్లడించాడు.
ఐతే దర్శకుడిగా తనకు త్వరగానే అవకాశాలు వచ్చినా, అందులో ఏదీ కార్యరూపం దాల్చక తాను పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావని ఆదిత్య వెల్లడించాడు. తాను తీసిన ‘బూంద్’ అనే షార్ట్ ఫిలిం నచ్చి ఒక పెద్ద ప్రొడ్యూసర్ సినిమా తీసే అవకాశం ఇవ్వగా.. తన తల్లిదండ్రులను ముంబయికి పిలిచి పెద్దగా సెలబ్రేట్ కూడా చేశానని.. కానీ అంతలో తన కథతో వేరే దర్శకుడు ఆ సినిమా తీశాడని, కనీసం క్రెడిట్ కూడా ఇవ్వలేదని ఆదిత్య చెప్పాడు.
ఆపై ప్రియదర్శన్ దగ్గర అసిస్టెంట్గా పని చేస్తున్న సమయంలో 2013లో దర్శకుడిగా మరో అవకాశం వచ్చిందని.. ఒక పెద్ద స్టార్ సినిమా చేయడానికి ముందుకు వచ్చాడని, కానీ దానికి ఫైనాన్స్ చేయాల్సిన వ్యక్తికి అనుకోకుండా వ్యాపారంలో నష్టం వచ్చి ఆ సినిమా కూడా ముందుకు కదల్లేదని ఆదిత్య వెల్లడించాడు.
ఇలా రెండు సినిమాలు ఓకే అయినట్లే అయి ఆగిపోవడంతో తనపై ఇండస్ట్రీలో ‘ఐరెన్ లెగ్’ ముద్ర వేశారని ఆదిత్య గుర్తు చేసుకున్నాడు. అయినా తాను వెరవకుండా ఏడాది వ్యవధిలో మూడు కథలు రెడీ చేసుకున్నానని.. కానీ తాను అవకాశాల కోసం తిరుగుతుండగా, తాను ఎంతో నమ్మిన స్నేహితుడు తన కథలు రెంటిని అమ్మేసుకున్నాడని.. ఆ రెండూ వంద కోట్ల సినిమాలు అయ్యాయని ఆదిత్య చెప్పాడు. అప్పటికే పెద్ద ఎదురు దెబ్బలు తిని ఉండడంతో ఈ మోసానికి తానేమీ కుంగిపోలేదన్నాడు ఆదిత్య.
చివరికి ఫవాద్ ఖాన్ హీరోగా కరణ్ జోహార్ తన దర్శకత్వంలో సినిమా చేయడానికి సిద్ధమయ్యాడని.. కానీ అప్పుడే ‘యురి’ ప్రాంతంలో ఉగ్రదాడి జరగడంతో పాకిస్థాన్ నటుడైన ఫవాద్తో సినిమా చేయబోతున్నందుకు కరణ్ ఆఫీసును ఆందోళనకారులు ధ్వంసం చేశారని.. అలా ఆ సినిమాకూ బ్రేక్ పడిందని ఆదిత్య తెలిపాడు.
కానీ తనకు జరిగిన నష్టం నుంచే అవకాశాన్ని వెదుక్కుని, యురి సర్జికల్ స్ట్రైక్ నేపథ్యంలో కథ రాశానని.. అప్పటికి వేరే ఫిలిం మేకర్స్ కూడా ఆ ఘటన నేపథ్యంలో సినిమాలు చేయాలనుకుంటుండగా.. తాను ఒక ఫ్రెండు ద్వారా రోనీ స్క్రూవాలాకు స్క్రిప్టు పంపడం, ఆయన ఆమోదం లభించడంతో ‘యురి: సర్జికల్ స్ట్రైక్’ పట్టాలెక్కిందని, ఆ సినిమా పెద్ద సక్సెస్ కావడంతో తాను దర్శకుడిగా స్థిరపడ్డానని ఆదిత్య వెల్లడించాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates