బంగారం లాంటి మార్కెట్ గుల్లయింది


గత దశాబ్ద కాలంలో తెలుగు సినిమాకు బంగారు బాతులా మారింది ఓవర్సీస్ మార్కెట్. ఒకప్పుడు అక్కడ తెలుగు సినిమా రిలీజవడమే గొప్ప అన్నట్లుండేది. కానీ అక్కడ ఒక్కో సినిమా మిలియన్లకు మిలియన్లు కొల్లగొట్టే రోజులొచ్చాయి. ఓవర్సీస్ హక్కులు కోట్లలో పలకడం మొదలైంది. పెద్ద స్టార్ల సినిమాలకు ఓవర్సీస్ హక్కులు రూ.25 కోట్ల వరకు పలికిన రోజులు కూడా ఉన్నాయి. ‘బాహుబలి’ రెండు భాగాలు ఓవర్సీస్ మార్కెట్లో సృష్టించిన సంచలనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

‘రంగస్థలం’ సినిమా యుఎస్‌లో మూడున్నర మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు రాబట్టడం గమనార్హం. ఐతే కరోనా దెబ్బకు దేశీయ మార్కెట్ లాగే ఓవర్సీస్ మార్కెట్ కూడా బాగా దెబ్బ తినేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్యే థియేటర్లు తెరుచుకున్నాయి. ప్రస్తుతం 50 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి. ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమాకు వచ్చిన స్పందన చూస్తే పరిస్థితి ఆశాజనకంగానే ఉన్నాయి. 100 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడిస్తే అంతా సర్దుకుంటుంది.

కానీ ఓవర్సీస్ మార్కెట్ ఎప్పుడు పుంజుకుంటుందన్నది మాత్రం చెప్పలేని పరిస్థితి. యుఎస్‌తో పాటు యూకే, ఇంకా అనేక యూరప్ దేశాలు, గల్ఫ్ కంట్రీస్‌లో తెలుగు సినిమాలు పెద్ద ఎత్తున రిలీజయ్యేవి. కానీ కరోనా ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపుతుండటంతో అన్ని చోట్లా సాధారణ పరిస్థితులు వచ్చి థియేటర్లు మునుపటిలా నడవడానికి ఎంత సమయం పడుతుందో అంతుబట్టడం లేదు. యుఎస్ విషయానికే వస్తే మేజర్ థియేటర్ ఛైన్స్ మూతపడి ఉన్నాయి. చాలా సిటీల్ల థియేటర్లు నడవట్లేదు. సెలక్టివ్‌గా థియేటర్లు సినిమాలను ప్రదర్శిస్తున్నాయి.

మామూలుగా అయితే సాయిధరమ్ తేజ్ సినిమా వందకు తక్కువ కాకుండా థియేటర్లలో రిలీజయ్యేది. అలాంటిది ‘సోలో బ్రతుకే’.. అటు ఇటుగా పది థియేటర్లలో రిలీజ్ చేశారు. మిగతా దేశాల్లో అయితే అది కూడా లేదు. నిర్మాతలు కొత్త సినిమాలు రిలీజ్ చేయడానికి జంకుతుండటానికి ఇది కూడా ఒక కారణం. కానీ తెలుగు సినిమాలు మామూలుగా పెద్ధ ఎత్తున రిలీజయ్యే దేశాలన్నింట్లో పరిస్థితులు మెరుగుపడి పూర్వంలా సినిమాలు నడవాలంటే ఎంత సమయం పడుతుందో చెప్పలేం. అందుకు ఇంకో ఏడాది పట్టినా ఆశ్చర్యం లేదేమో. అంతవరకు ఈ మార్కెట్ మీద నిర్మాతలు ఆశలు వదులుకోవాల్సిందే.