రైటర్ గారు… చేదుగా ఉన్నా నిజమే చెప్పారు

రచయిత బివిఎస్ రవి ఒక్కోసారి బాగా ఓపెన్ అయిపోతారు. ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తారు. తాజాగా మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ దురంధర్ ని టాలీవుడ్ లో కనక తీస్తే అయిదు వందల కోట్లు ఖర్చు పెట్టించి, క్వాలిటీ తక్కువగా ఉన్న ప్రోడక్ట్ చేతిలో పెడతారని, పరిస్థితులు అలా తయారయ్యాయని కుండబద్దలు కొట్టేశారు. అయన ఫలానా సినిమా గురించని ఉదాహరణలు చెప్పలేదు కానీ కొంచెం ప్రాక్టికల్ గా ఆలోచిస్తే అందులో ఎంత చేదు నిజం ఉందో అర్థమవుతుంది.

నిజమే. మనోళ్లు గ్రాండియర్ల మీద పెడుతున్న దృష్టి కంటెంట్ల మీద పెట్టరు. ఒక ప్యాన్ ఇండియా మూవీ అయిదు సంవత్సరాలు తీస్తారు. తీరా చూస్తే మూడో రోజే థియేటర్లు ఖాళీ. ఇంతోటి దానికి మళ్ళీ సీక్వెల్ ఉందంటూ చివర్లో శుభం కార్డు దగ్గర ట్విస్టు. అదిచ్చిన నష్టాలకు సదరు నిర్మాత హైదరాబాద్ రావడమే మానేశారు. తెరనిండా స్టార్ క్యామియోలు నిండిపోయిన ఇంకో డివోషనల్ మూవీ అద్భుతాలు చేస్తుందనుకుంటే ఆయాసంతో రెండో వారమే వెనక్కు వచ్చేసింది.

ఇక్కడ చెప్పింది రెండింటి గురించే కానీ చెప్పుకుంటూ పోతే ఇలాంటివి బోలెడు వస్తాయి. దురంధర్ కేవలం రెండేళ్లలో రెండు వందల యాభై కోట్లతో తీసి మూడు నెలల్లో రెండు భాగాలు రిలీజ్ చేశారు దర్శకుడు ఆదిత్య ధార్. కట్ చేస్తే మొత్తం కలిపి మూడు వేల కోట్ల గ్రాస్ దాటిపోయేలా ఉంది. ఇంత చేసి ఇదేమైనా ఫాంటసీ మూవీనా అంటే కాదు. జానపదమా అంటే కాదు. అసలు మనకు సంబంధమే లేని శత్రుదేశం పాకిస్థాన్ బ్యాక్ డ్రాప్ లో తీసిన ఏడున్నర గంటల స్పై డ్రామా.

బీవీఎస్ రవి అన్నట్టు తెలుగు దర్శకులు ఫోకస్ పెట్టాల్సింది ఇలాంటి క్వాలిటీ మీదే. ఎంతసేపూ ఎలివేషన్లు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్లతో హీరోయిజం చూపించే కథలు కాకుండా ఆడియన్స్ కి త్వరగా కనెక్ట్ అయ్యేలా డ్రామాలు ఆవిష్కరించాలి. రాజమౌళి, సుకుమార్ తరహాలో ప్రతిఒక్కరు కష్టపడాలి. అంతే తప్ప క్రేజ్ ఉంది కదాని కాంబినేషన్ సెట్ కాగానే సెట్స్ వైపు పరుగులు పెట్టకూడదు. దీని వల్ల నిర్మాతలకు జేబులకు చిల్లులు పడటం తప్ప కాసుల జల్లులు కురవవు.