2019 ఎన్నికల కోసం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన తర్వాత, రెండు సంవత్సరాల గ్యాప్ అనంతరం మళ్లీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుసగా అనేక ప్రాజెక్టులకు కమిట్ అయ్యాడు. కానీ ఆ కమిట్మెంట్లను సమయానికి పూర్తి చేయడం మాత్రం కష్టమైంది. ముఖ్యంగా హరిహర వీరమల్లు మరియు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు ఏళ్లకు ఏళ్లు ఆలస్యమవుతూ వచ్చాయి. దీంతో వాటి బడ్జెట్లు కూడా భారీగా పెరిగిపోయాయి.
ఈ ఆలస్యాల కారణంగా నిర్మాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పరిస్థితి ఇలా ఉండటంతో, ఆలస్యానికి తానే కారణమనే భావనతో పవన్ నిర్మాతల పట్ల కొంత సడలింపు చూపాల్సిన పరిస్థితి ఏర్పడింది. హరిహర వీరమల్లు విషయంలో అయితే దాదాపుగా పారితోషకం తీసుకోలేదనే చెప్పాలి. సినిమా విడుదల కూడా అనిశ్చితిలో పడిన సమయంలో, ఇతర నిర్మాతల సహకారంతో విడుదల జరిగింది. విడుదల తర్వాత చూసుకుందామని చెప్పినప్పటికీ, సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావడంతో నిర్మాత పరిస్థితి కష్టాల్లో పడింది. అలాంటి పరిస్థితిలో పవన్ తన పారితోషకం గురించి అడగడం అసంభవమే.
ఇక ఉస్తాద్ భగత్ సింగ్ విషయానికి వస్తే, ఈ సినిమాకు కూడా పవన్ కేవలం నామినల్ అడ్వాన్స్ మాత్రమే తీసుకున్నట్లు నిర్మాత స్వయంగా వెల్లడించాడు. మైత్రి సంస్థ నుంచి ముందుగా రూ.5 కోట్ల అడ్వాన్స్ తీసుకున్నాడు. ఇదే సంస్థ హరిహర వీరమల్లు విడుదలకు ముందుకొచ్చి నష్టాలు చవిచూసింది. పవన్ ఆలస్యాల వల్ల ఉస్తాద్ భగత్ సింగ్ పై కూడా అదనపు భారం పడింది.
రిలీజ్ తర్వాత పరిస్థితిని బట్టి చూసుకుందామని పవన్ చెప్పినట్లు సమాచారం. కానీ ఇప్పుడు చూస్తే ఈ సినిమా కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్గా నిలిచింది. దీంతో మైత్రి సంస్థకు గట్టి దెబ్బ తగిలినట్టే.
ఇలాంటి పరిస్థితుల్లో పవన్ మిగతా పారితోషకం అడగడం కష్టమే. నిర్మాతలు ఆఫర్ చేసినా కూడా తిరస్కరించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మొత్తానికి చూస్తే, పవన్ కళ్యాణ్కు మరోసారి రెమ్యూనరేషన్ కోత పడినట్టే.
Gulte Telugu Telugu Political and Movie News Updates
