బ్యాడ్ బాయ్ ఎందుకు మౌనంగా ఉన్నాడు

ప్రేక్షకుల్లో హీరో నాగ శౌర్యకు మంచి గుర్తింపు ఉంది. ఛలో బ్లాక్ బస్టర్ సాధించాక యూత్ లోనూ ఫాలోయింగ్ పెరిగింది. దాంతోనే టాలీవుడ్ కు పరిచయమైన రష్మిక మందన్న ఇప్పుడు ఏ స్థాయిలో ఉందో చూస్తున్నాం. గీత గోవిందంతో మొదలుపెట్టి పుష్ప 2 దాకా పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్స్ తన ఖాతాలో ఉన్నాయి. కానీ నాగ శౌర్య మాత్రం వరస డిజాస్టర్లతో మార్కెట్ ని రిస్క్ లో పెట్టేసుకున్నాడు. బిజినెస్ పరంగా కూడా తన క్రేజ్ తగ్గిపోయిన మాట వాస్తవం.

ఈ యూత్ హీరో లాస్ట్ మూవీ 2023లో వచ్చింది. రంగబలి మీద చాలా నమ్మకం పెట్టుకున్నాడు కానీ అదేమో దారుణంగా పోయింది. అంతకు ముందు ఫలానా అమ్మాయి ఫలనా అబ్బాయి, కృష్ణ వృందా విహారి, లక్ష్య, వరుడు కావలెను, అశ్వద్ధామ అన్నింటికీ ఒకే రిజల్ట్. ఏ మార్పు లేదు. ఓ బేబీ హిట్టయినా అది సమంతా అకౌంట్ లోకి వెళ్ళిపోయింది. నాగ శౌర్య కొత్త మూవీ బ్యాడ్ బాయ్ కార్తీక్ విడుదలకు రెడీ అవుతోంది. దీని ప్రమోషన్లు నెలల క్రితమే మొదలుపెట్టారు.

కానీ విడుదల తేదీ తేలడం లేదు. ఓటిటి డీల్, థియేటర్ బిజినెస్, శాటిలైట్ తదితర హక్కులకు సంబంధించి ఇంకా పెండింగ్స్ చాలానే ఉన్నాయట. అందుకే లేట్ అవుతోందని అంటున్నారు. అప్పుడప్పుడు ఓ పాటను విడుదల చేయడం ఆ తర్వాత సైలెంట్ అయిపోవడం పరిపాటిగా మారింది. కంటెంట్ ఎలా ఉందనేది పక్కనపెడితే బ్యాడ్ బాయ్ కార్తీక్ జనాలకు రీచ్ కాలేదు. మూవీ లవర్స్ కు సైతం దీని మీద అవగాహన తక్కువే. ముందీ పని చూడాలి.

ఎన్ని ఫ్లాపులు ఉన్నా నిర్మాతలు సిద్ధంగా ఉన్నప్పుడు హీరో కంటిన్యూగా సినిమాలు చేస్తూనే ఉండాలి. ఏదో ఒక బ్రేక్ కచ్చితంగా వస్తుంది. అంతే తప్ప గ్యాప్ తీసుకున్నంత మాత్రాన ఆడియన్స్ మన కోసం ఎదురు చూడరు. నాగ శౌర్య ఇది మర్చిపోకూడదు. అందం, రూపం, నటన అన్నీ ఉన్నప్పుడు రెగ్యులర్ గా తెరమీద కనిపించాలి. వర్కౌట్ కావడం లేదని స్క్రీన్ కు దూరమైతే పబ్లిక్ దూరమయ్యే ప్రమాదముంది. బ్యాడ్ బాయ్ కార్తిక్ తో పాటు శౌర్య స్పీడ్ పెంచాల్సిన టైం అయితే వచ్చేసింది.