నిన్న విడుదలైన ఎస్ సర్వసతి సినిమా చుట్టూ కొత్త వివాదం నెలకొంది. దీనికి కథను అందించిన రచయిత సాయిమాధవ్ బుర్రా రాత్రి సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తూ తన కథను మానభంగం చేశారని, పూర్తిగా రివెంజ్ డ్రామాగా మార్చేసి దాని ఆత్మను చంపేశారనే రీతిలో నిరసన వ్యక్తం చేయడం హాట్ టాపిక్ అయ్యింది. ఆర్ఆర్ఆర్ లాంటి ప్యాన్ ఇండియా రైటర్ నుంచి ఇలాంటి కామెంట్ అందులోనూ ఒక చిన్న చిత్రం మీద రావడం ఆశ్చర్యానికి గురి చేసింది. హీరోయిన్ కం దర్శకురాలు వరలక్ష్మి శరత్ కుమార్ దానికి క్లారిటీ ఇచ్చారు.
కేవలం ఆడియో నోట్ లో వచ్చిన స్టోరీ విని నేను సరస్వతిని డెవలప్ చేసుకున్నానని, చాలా మంది సెకండాఫ్ లో విపరీతమైన ల్యాగ్ ఉందనే అభిప్రాయం వ్యక్తం చేయడం వల్ల ఇప్పటి జనరేషన్ కు కన్సెట్ అయ్యేలా మార్పులు చేసిన మాట వాస్తవమే అన్నారు. ఆరు సంవత్సరాల నుంచి ఈ స్టోరీ సాయి మాధవ్ బుర్రా దగ్గర ఉందని, నిజంగా అంత గొప్ప సబ్జెక్టు అయితే ఇన్నేళ్లు ఎందుకు తెరకెక్కలేదని ప్రశ్నించారు. అంతే కాదు పలుమార్లు పిలిచినా సిట్టింగ్స్ కు రాలేదు కనకే స్వంతంగా వర్క్ చేయాల్సి వచ్చిందని, రేప్ అనే దారుణమై పదం ఆయన వాడకుండా ఉండాల్సిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక్కడ ఎవరు రైట్ ఎవరు రాంగ్ అనే ప్రశ్న తలెత్తుతోంది. ఇద్దరి వెర్షన్లలో లాజిక్కులు, వాస్తవాలు ఉన్నాయి. మార్పులు ఎక్కువ చేసుకున్నప్పుడు మూల కథ కింద సాయిమాధవ్ బుర్ర పేరు వేసి, కథా విస్తరణ కింద వరలక్ష్మి పేరు ఉంటే సరిపోయేది. లేదూ ముందే సదరు రైటర్ నుంచి అగ్రిమెంట్ రాయించుకుని ఉంటే ఇప్పుడీ కాంట్రవర్సీ తలెత్తేది కాదేమో. వరలక్ష్మి శరత్ కుమార్ చెప్పిన దాని ప్రకారం రెమ్యునరేషన్లు కూడా చెల్లించేశారట. ఆవిడ వెర్షన్లో నిజా నిజాలు ఎంతనేది సాయి మాధవ్ బుర్ర స్వయంగా వివరణ ఇస్తే తప్ప క్లారిటీ రాదు.
ఇలాంటివి జరగడం టాలీవుడ్ లో కొత్తేమి కాదు. హరిహర వీరమల్లు నుంచి క్రిష్ తప్పుకున్నాక ఆ బాధ్యతను జ్యోతికృష్ణ తీసుకున్నారు. మణికర్ణికా టైంలోనూ ఇలాగె జరిగింది. రచనలోనే కాదు ఇతర సాంకేతిక విభాగాల్లోనూ ఇలాంటివి చూస్తుంటాం. మార్చి 19 విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ కు దేవిశ్రీ ప్రసాద్ స్థానంలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం తమన్ ను తీసుకున్న సంగతి తెలిసిందే. ఇవన్నీ పరస్పర అంగీకారంతో జరిగాయి కాబట్టి సమస్యలు తలెత్తలేదు. కానీ సరస్వతి విషయంలో జరిగింది మాత్రం పూర్తి వాస్తవాలు అవగతమయ్యాకే క్లారిటీ వస్తుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates