సోహైల్ హీరో అయిపోయాడుగా..

బిగ్ బాస్ తెలుగు నాలుగో సీజన్ ముగిసిపోయింది. అందరి అంచనాలకు తగ్గట్లే అభిజిత్ ఈ సీజన్ విజేతగా నిలిచాడు. ఈ విషయంలో నిజానికి పెద్ద ఉత్కంఠేమీ లేదు. కానీ వారం ముందు నుంచి సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు నడిచాయి. ఒక దశలో తొలిసారి లేడీ కంటెస్టెంట్ విజేతగా నిలవబోతోందని.. అరియానా టైటిల్ విన్నర్ అని కూడా ప్రచారం జరిగింది. కానీ చివరికి అభిజితే విజేతగా నిలిచాడు.

టాప్-2లో తనతో పాటు నిలిచిన అఖిల్ రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. సోహైల్ మూడో స్థానంలో నిలిచాడు. అరియానా, హారిక తర్వాతి స్థానాలు దక్కించుకున్నారు. అభిజిత్ మెజారిటీ బిగ్ బాస్ ఫాలోవర్ల అభిమానం పొందాడన్నది స్పష్టం. ఐతే ఫైనల్ రోజు మాత్రం అతణ్ని మించి హైలైట్ అయిపోయాడు సోహైల్. తన చర్యలతో, మంచి మనసుతో అతను అందరి మనసు దోచేశాడు.

ఫైనల్‌ పోటీ నుంచి తప్పుకుని నిష్క్రమించేట్లయితే రూ.25 లక్షలు దక్కుతాయని నాగార్జున చెప్పగా.. అతను అందుకు అంగీకరించాడు. ఐతే ఆ 25 లక్షల ప్రైజ్ మనీలో పది లక్షలు అనాథాశ్రమానికి ఇస్తానని అతను ప్రకటించడం విశేషం. సోహైల్ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా అతడికి డబ్బు చాలా అవసరం అయినప్పటికీ అతను తనకు వచ్చే 40 శాతం అనాథాశ్రమానికి ఇచ్చేయడానికి సిద్ధపడటం గొప్ప విషయమే. అంతే కాదు.. ఇంకో ఐదు లక్షలు బిగ్ బాస్ హౌస్‌లో తనకు అత్యంత ఆత్మీయుడిగా మెలిగిన మెహబూబ్‌కు ఇవ్వడానికి అతను సిద్ధపడ్డాడు.

ఐతే మెహబూబ్ తనకా డబ్బు వద్దని, దాన్ని కూడా అనాథాశ్రమానికే ఇచ్చేస్తానని అన్నాడు. వీరి స్పందనకు ఫిదా అయిన నాగ్.. వాళ్లిద్దరూ తమ డబ్బును ఇవ్వాల్సిన పని లేదని.. తానే రూ.10 లక్షలు వారి తరఫున అనాథాశ్రమానికి ఇస్తానని అన్నాడు. తర్వాత ట్రోఫీ ప్రెజెంటేషన్ కోసం ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి ఈ విషయం తెలిసి సోహైల్ తరఫున తాను రూ.10 లక్షలు అనాథాశ్రామానికి ఇస్తానంటూ అప్పటికప్పుడు చెక్కు రాసి ఇచ్చేయడం విశేషం. ఈ మొత్తం వ్యవహారానికి నాంది పలికిన సోహైల్ హీరోగా నిలిచాడు.