సాయిపల్లవి బరిలో ఉంటే అవార్డ్ ఇవ్వాల్సిందే

హీరోల కోసం థియేటర్లకు వచ్చే ప్రేక్షకులు చాలామందే ఉంటారు. హీరోయిన్ల గ్లామర్ కోసం కూడా కొంతమంది సినిమాలకు వస్తారు. కానీ ఒక హీరోయిన్ పెర్ఫార్మెన్స్ చూద్దాం అని పెద్ద సంఖ్యలో ఆడియన్స్ థియేటర్లకు రావడం చాలా కొద్దిమంది విషయంలోనే జరుగుతుంది. సాయిపల్లవి ఆ కోవకు చెందిన కథానాయికే.

కేవలం ఆమె వల్ల ఆడిన, తన వల్ల చాలా పెద్ద రేంజికి వెళ్ళిన సినిమాలు చాలానే ఉన్నాయి. తొలి చిత్రం ప్రేమమ్ నుంచి అమరన్ వరకు చాలా చిత్రాలకు ఆమె ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ క్రమంలో ఎన్నో అవార్డులు కూడా అందుకుంది. ముఖ్యంగా ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో సాయిపల్లవిది తిరుగులేని ఆధిపత్యం.

ఆమె బరిలో ఉంది అంటే అవార్డ్ రావాల్సిందే. ఇప్పటికే వివిధ విభాగాల్లో ఆరు ఫిల్మ్ ఫేర్ అవార్డులు సొంతం చేసుకున్న ఈ టాలెంటెడ్ హీరోయిన్.. తాజాగా ఏడో పురస్కారాన్ని గెలుచుకుంది.

70వ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల్లో సౌత్ ఇండస్ట్రీ వేడుకను తాజాగా నిర్వహించారు. ఇందులో ‘అమరన్’ సినిమాకి ఉత్తమ కథానాయికగా సాయిపల్లవే ఎంపిక అయింది. ప్రేమమ్ (2015 – మలయాళం) సినిమాకు ఆమె తొలిసారిగా దక్షిణాది ఉత్తమ అరంగేట్ర కథానాయికగా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ సాధించింది.

ఆ తర్వాత ఫిదా (2017 – తెలుగు), లవ్ స్టోరీ (2021 – తెలుగు), శ్యామ్ సింగరాయ్ (2021 – తెలుగు), గార్గి (2022 – తమిళం) చిత్రాలకు ఉత్తమ నటిగా ఎంపికైంది. మధ్యలో 2022లో విరాటపర్వం సినిమాకు క్రిటిక్స్ ఉత్తమ నటిగా నిలిచింది. ఇప్పుడు మళ్ళీ అమరన్ మూవీకి బెస్ట్ యాక్ట్రెస్ గా అవార్డ్ సొంతం చేసుకుంది.

ఈ తరంలో ఇన్ని ఫిల్మ్ ఫేర్ అవార్డులు గెలిచిన నటి మరొకరు కనిపించరు. ఓవరాల్ గా కూడా దక్షిణాదిన అత్యధిక అవార్డులు సాధించిన కథానాయికల్లో సాయిపల్లవి ఒకరు. ప్రస్తుతం సాయిపల్లవి రామాయణం లాంటి మెగా మూవీతో పాటు తమిళంలో ధనుష్ సరసన ఒక సినిమా చేస్తోంది.