రాజు గారు రెచ్చిపోతున్నారు

నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్‌గా ఎదిగాక.. గత రెండు దశాబ్దాల్లో ఎంతోమంది కొత్త పంపిణీదారులు వచ్చారు. కొన్నాళ్లు దూకుడు చూపించి, తర్వాత కనుమరుగైపోయారు. ఐతే దిల్ రాజు ఏకఛత్రాధిపత్యానికి చెక్ పెట్టాలనే ప్రయత్నాలు మాత్రం ఆగడం లేదు.

మైత్రీ సంస్థ దిల్ రాజుతో విభేదించే, కొన్నేళ్ల ముందు సొంత డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ పెట్టుకుందని ఫిలిం నగర్ టాక్. కానీ ఆ సంస్థ పంపిణీ వ్యవహారం సాఫీగా ఏమీ సాగట్లేదు. కాగా ఇటీవల అన్నపూర్ణ లాంటి పెద్ద సంస్థ నైజాం డిస్ట్రిబ్యూషన్లోకి రావడం చర్చనీయాంశంగా మారింది. లేటెస్ట్‌గా ధీరజ్ మొగిలినేని సైతం రంగంలోకి దిగాడు. ఇంకా కొందరు ఈ బాటలోనే సాగబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇది ఒక రకంగా దిల్ రాజుకు సవాలు విసరడమే.

ఐతే ఈ ఛాలెంజ్‌కు దిల్ రాజు వెంటనే స్పందించాడు. తాను కొనాలనుకున్న సినిమాలు వేరే వాళ్ల చేతుల్లోకి వెళ్లినా.. ఆయనేమీ కంగారు పడిపోలేదు. అగ్రెసివ్‌గా కొత్త కొనుగోళ్లు మొదలు పెట్టారు. యశ్ మూవీ ‘టాక్సిక్’ తెలుగు హక్కులు ఏకంగా రూ.120 కోట్లు పెట్టి కొనడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.

తాజాగా తరుణ్ భాస్కర్ హీరోగా తెరకెక్కిన ‘గాయపడ్డ సింహం’ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌‌కు కూడా కలిపి ఆయన హోల్ సేల్‌గా కొనేశారు. ఇందుకోసం రూ.6 కోట్లు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ మధ్యే ‘ఓం శాంతి శాంతి శాంతి:’తో షాక్ తిన్నప్పటికీ తరుణ్ సినిమా మీద ఇంత పెట్టుబడి పెట్టడం అంటే సాహసమే.

కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేస్తుందని నమ్మి పెద్ద ఇన్వెస్ట్‌మెంట్ పెట్టేశారు రాజు. దీంతో పాటే మరో కొత్త సినిమా హక్కులను కూడా రాజు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.

శర్వానంద్ కొత్త చిత్రం ‘బైకర్’ తెలుగు రాష్ట్రాల రైట్స్‌ను ఆయన రూ.20 కోట్లకు కొన్నారట. ఈ సినిమా స్థాయికి ఇది ఫ్యాన్సీ రేటే. కానీ శర్వానంద్ వరుస ఫ్లాపుల్లో ఉండగా ‘నారీ నారీ నడుమ మురారి’ని కొని మంచి లాభాలందుకున్న రాజు.. ‘బైకర్’ అంతకుమించి సక్సెస్ కాగలదని నమ్మి ఆ సినిమా మీద పెద్ద పెట్టుబడి పెట్టేశారు. ఒక రకంగా నైజాంకు తనకు చెక్ పెట్టాలని చూస్తున్న వారికి ఇది రాజు సమాధానంగా కనిపిస్తోంది.