సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ భారీ ప్యాన్ ఇండియా మూవీ సంబరాల ఏటిగట్టు విడుదల తేదీ ఇప్పటిదాకా ఫైనల్ కాలేదు. ముందు ప్లాన్ చేసుకున్న ప్రకారమైతే గత ఏడాది సెప్టెంబర్ 25 వచ్చి ఉండాలి. కానీ ఆ డేట్ కి ఓజి ఉండటంతో పాటు షూటింగ్ బాలన్స్ వల్ల నిర్ణయం మార్చుకున్నారు. డిసెంబర్ లో అఖండ 2 ఉంది కాబట్టి వద్దనుకున్నారు.
కట్ చేస్తే ఇవన్నీ జరిగి ఐదు నెలలు దాటిపోతున్నా ఇప్పటిదాకా టీమ్ నుంచి ఎలాంటి అప్డేట్ రావడం లేదు. బడ్జెట్ ఆల్రెడీ వంద కోట్లు దాటిపోయిందని, ఇంకా ఓటిటి డీల్స్ తో పాటు ఇతరత్రా ఒప్పందాలు పెండింగ్ లో ఉండటం వల్లే ఆలస్యమవుతోందని అంటున్నారు.
ముందైతే ఏదో ఒక తేదీని లాక్ చేసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే ఎప్పుడో పదకొండు నెలల తర్వాత వచ్చే 2027 సంక్రాంతికి ఇప్పటి నుంచే కర్చీఫ్ లు వేస్తున్నారు. పెద్ది, ప్యారడైజ్ లు సైతం వాయిదా బారిన పడి కొత్త అనౌన్స్ మెంట్లు ఇచ్చేశాయి.
కానీ వీటికన్నా చాలా ముందుగా ప్రారంభమైన సంబరాల ఏటిగట్టు మాత్రం ఇంకా ముహూర్తం కోసం ఎదురుచూస్తోంది. ఇంకో వైపు సాయి దుర్గ తేజ్ కొత్త కమిట్ మెంట్లు ఇచ్చేస్తున్నాడు. క దర్శకులు సందీప్ సుజిత్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. సాహు గారపాటి దీన్ని నిర్మించబోతున్నారు. త్వరలోనే అధికారిక రాబోతోంది. ఉగాదికే షూటింగ్ ఉండొచ్చు.
కానీ సంబరాల ఏటిగట్టు విషయంలో జరుగుతున్న జాప్యం హీరోకే కాదు అభిమానులకో అసహనాన్ని కలిగిస్తోంది. హనుమాన్ తర్వాత నిర్మాత నిరంజన్ రెడ్డి దీని మీద పెద్దఎత్తున పెట్టుబడి ఇన్వెస్ట్ చేశారు. అది రికవర్ కావాలంటే అంత ఈజీ కాదు.
కెజిఎఫ్, పుష్ప తరహాలో ఒక విభిన్న ప్రపంచంలో రూపొందుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ కోసం సాయి దుర్గ తేజ్ శారీరకంగా మానసికంగా చాలా కష్టపడ్డాడు. దానికి తగ్గ ఫలితం రావాలంటే పోటీ లేకుండా సోలో డేట్ చూసుకోవాలి. విశ్వంభర, పెద్ది, ఉస్తాద్ భగత్ సింగ్, కొరియన్ కనకరాజు లాంటి మెగా మూవీస్ తో క్లాష్ లేకుండా చూసుకోవాలి. మరి నిర్ణయం ఎప్పుడు వెలువడుతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates