నైజాం కొత్త దుకాణం… నిర్మాత ఏమ‌న్నాడంటే?

తెలుగు రాష్ట్రాల్లో సినిమాల‌కు బిజినెస్ ప‌రంగా అత్యంత కీల‌క‌మైన నైజాం ఏరియాలో కొత్త డిస్ట్రిబ్యూష‌న్ సంస్థ‌లు తెర‌పైకి రావ‌డం ఇటీవ‌ల చ‌ర్చ‌నీయాంశంగా మారిన సంగ‌తి తెలిసిందే. ఇన్నాళ్లూ ప్రొడ‌క్ష‌న్‌కే ప‌రిమితం అవుతూ, ఎప్పుడో ఒక‌సారి వేరే సినిమాల‌ను రిలీజ్ చేస్తూ వ‌చ్చిన‌ అన్న‌పూర్ణ స్టూడియోస్ సంస్థ.. పూర్తి స్థాయిలో పంపిణీ రంగంలోకి దిగిన సంగ‌తి తెలిసిందే.

ఒకేసారి ఆ సంస్థ దాదాపు అర‌డ‌జ‌ను సినిమాల‌ను నైజాంలో రిలీజ్ చేసే దిశ‌గా ఒప్పందం చేసుకున్న‌ట్లు వెల్ల‌డైంది. ఇంకో రెండు మూడు సంస్థ‌లు నైజాం డిస్ట్రిబ్యూష‌న్లోకి వ‌స్తున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. అందులో ధీర‌జ్ మొగిలినేని సంస్థ కూడా ఒక‌టి. అత‌ను కపుల్ ఫ్రెండ్లీ సినిమాను నైజాంలో పంపిణీ చేస్తున్నాడు.

ఇందుకోసం ఆఫీస్ కూడా మొద‌లుపెట్టాడు. దిల్ రాజు అండ్ కోకు చెక్ పెట్ట‌డానికి, ఏక‌ఛ‌త్రాధిప‌త్యాన్ని అరిక‌ట్ట‌డానికి, అలాగే డిస్ట్రిబ్యూషన్లో త‌లెత్తుతున్న ఇబ్బందులు, మోసాల‌ను అధిగమించ‌డానికే ఇండ‌స్ట్రీలో ప‌లువురు నిర్మాత‌లు మాట్లాడుకుని సొంతంగా డిస్ట్రిబ్యూష‌న్ ఆఫీసులు తెరుస్తున్న‌ట్లు చ‌ర్చ జ‌రుగుతోంది.

ఈ నేప‌థ్యంలో ధీర‌జ్ మొగిలినేని క‌పుల్ ఫ్రెండ్లీ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో స్పందించాడు. తాను సుహృద్భావ వాతావ‌ర‌ణంలోనే సొంత డిస్ట్రిబ్యూట్ ఆఫీస్ మొద‌లుపెట్టినట్లు చెప్పాడు. త‌న‌కు దిల్ రాజు, శిరీష్ 20 ఏళ్లుగా తెలుసని, వారితో మంచి అనుబంధం ఉంద‌ని.. ఇలా డిస్ట్రిబ్యూష‌న్ ఆఫీస్ తెరుస్తున్నాన‌ని చెబితే, మంచిదే చేయ‌మ‌ని వారు త‌నను ప్రోత్స‌హించార‌ని చెప్పాడు ధీర‌జ్.

ఇక తాను ప్రొడ్యూస్ చేసిన‌ సినిమాల‌న్నింటినీ అల్లు అర‌వింద్ భాగస్వామ్యంతోనే చేశాన‌ని, ఆయ‌నా త‌న‌కు మ‌ద్ద‌తుగా ఉన్నార‌ని చెప్పాడు. సురేష్ బాబు సైతం తన‌కు అండ‌గానే నిలిచార‌న్నాడు.

నైజాం డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు బాగా డ‌బ్బులొచ్చే ఏరియా అని, ఇక్క‌డ డిస్ట్రిబ్యూట్ చేస్తే నాలుగు డ‌బ్బులు తినొచ్చ‌నే ఉద్దేశంతోనే ఇందులోకి దిగాన‌ని.. అంతే త‌ప్ప ఎవ‌రికీ పోటీ కాద‌ని, ఎవ‌రితోనూ త‌న‌కు గొడ‌వ‌లు లేవ‌ని స్ప‌ష్టం చేశాడు ధీర‌జ్. క‌పుల్ ఫ్రెండ్లీ సినిమా మీద న‌మ్మ‌కంతో నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాన‌ని.. ఈ సినిమా త‌న‌కు మంచి ఫ‌లితాన్నిస్తుంద‌ని అత‌ను ఆశాభావం వ్య‌క్తం చేశాడు.