శాంతి కోసం చాలా కష్టపడ్డారు కానీ

తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బ జంటగా నటించిన ఓం శాంతి శాంతి శాంతి మొన్న శుక్రవారం విడుదలయ్యింది. ప్రమోషన్లు బాగానే చేశారు. మలయాళం రీమేకని ఓపెన్ గా చెప్పి ఎందుకు చూడాలో, లాజికల్ గా వివరణ ఇచ్చి మరీ ఆడియన్స్ ని ఆకట్టుకునేందుకు నిర్మాత శత విధాలా ప్రయత్నించారు.

ఈవెంట్లు, ఇంటర్వ్యూలు అన్ని జరిగాయి. తీరా చూస్తే ఓపెనింగ్స్ రాలేదు. ఇలాంటి చిన్న సినిమాలకు పబ్లిక్ టాక్ కీలకం కాబట్టి మెల్లగా ఊపందుకుంటుందేమోనన్నీ చూస్తే అదీ కనిపించలేదు. నిన్న దీని కన్నా రెండు వారాల క్రితం రిలీజైన మన శంకరవరప్రసాద్ గారు, మిగిలిన సంక్రాంతి మూవీస్ కే ఎక్కువ బుకింగ్స్ జరగడం గమనించాల్సిన విషయం.

అలాని ఇదేదో పూర్తిగా తీసి పారేసే సినిమా కాదు కానీ సెకండాఫ్ ని హ్యాండిల్ చేయడంలో జరిగిన తడబాటు వల్ల వచ్చిన కాసిన్ని ఆడియన్స్ ని మెప్పించడంలో దర్శకుడు సక్సెస్ కాలేదు. భార్య భర్తల ఈగోలను ఒక సింపుల్ పాయింట్ తో తెరకెక్కించిన విధానం అన్ని వర్గాలను సంతృప్తిపర్చలేదన్నది వాస్తవం.

హీరోగా నటించిన తరుణ్ భాస్కర్ ఒకటి గుర్తించాలి. ఆర్టిస్టుగా కన్నా తను డైరెక్టర్ గా ఎక్కువ క్యాలిబర్ కలిగి ఉన్నాడు. పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది దాన్ని ఋజువు చేశాయి. కీడా కోలా అద్భుతాలు చేయకపోయినా ఒక సెక్షన్ ని మెప్పించింది. ఇప్పుడు ఈనఏ 2కి ఏకంగా నలభై కోట్ల బడ్జెట్ పెడుతున్నారు.

నటుడిగా తరుణ్ భాస్కర్ కు జనంలో ఎలాంటి ఫుల్ లేదు. తనను  చూసేందుకు టికెట్లు తెంపే జనాలు బిసి సెంటర్స్ లో లేరు. అలాని హైదరాబాద్ లాంటి చోట హౌస్ ఫుల్స్ పడుతున్నాయా అంటే అదీ లేదు. ఓ మోస్తరు ఆక్యుపెన్సీలతో జస్ట్ పర్వాలేదనిపిస్తున్నాయి అంతే.

అసలు కాంపిటీషన్ లేకుండా సోలోగా వచ్చినా కూడా ఓం శాంతి శాంతి శాంతికి ఇలాంటి రెస్పాన్స్ రావడం ట్రేడ్ వర్గాలకు షాకే. సంక్రాంతి హడావిడి తర్వాత వచ్చిన ఇంత గ్యాప్ ని వాడుకోలేకపోయిన తీరు విచారకరం. థియేట్రికల్ గా ఎలా పెర్ఫార్మ్ చేసినా డిజిటల్, శాటిలైట్ లో ఈ సినిమాకు బాగానే కిట్టుబాటు అయ్యిందని టాక్.