మెగాస్టార్ చిరంజీవి ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్న, ఎంతగానో కోరుకున్న సందర్భం రానే వచ్చింది. ఆయనకు మనవడు పుట్టాడు. చిరంజీవి కుటుంబంలో ఇద్దరు అమ్మాయిలు సుష్మిత, శ్రీజ.. అబ్బాయి రామ్ చరణ్లకు ఇప్పటిదాకా పుట్టిన సంతానం అంతా అమ్మాయిలే. వారి మీద ఆయనకు వివక్షేమీ లేదు కానీ.. ఒక మనవడు కూడా పుట్టాలన్నది ఆయన కోరిక.
ఈ విషయాన్ని ఇంతకుముందు బహిరంగంగానే చెప్పేశారు మెగాస్టార్. ఇప్పుడు ఆయన కోరికను రామ్ చరణ్, ఉపాసన దంపతులు నెరవేర్చారు. ఇప్పటికే ఒక అమ్మాయికి జన్మనిచ్చిన దంపతలు.. ఇప్పుడు కవల పిల్లల్ని కన్నారు. అందులో ఒకరు అబ్బాయి, ఇంకొకరు అమ్మాయి కావడం విశేషం. దీంతో మెగా ఫ్యామిలీలో, అలాగే అభిమానుల్లో సంతోషానికి అవధులు లేకపోయాయి. నిన్న సాయంత్రం నుంచే సంబరాలు మిన్నంటాయి.
ఐతే చిరుకు మనవడు, చరణ్కు కొడుకు పుట్టినందుకు అభిమానులు సంబరాలు చేసుకోవడం బాగానే ఉంది. కానీ ఆ సంబరాలు కాస్త హద్దులు దాటిపోవడమే విమర్శలకు దారి తీసింది. ఉపాసన డెలివరీ జరిగిన అపోలో హాస్పిటల్ ప్రాంగణంలో అభిమానులు భారీ స్థాయిలో బాణసంచా కాల్చడం వివాదాస్పదమైంది.
హాస్పిటల్లో చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు పేషెంట్లు ఉంటారు. కాబట్టి ఇక్కడ బాణసంచా పేలిస్తే వాళ్లందరికీ ఇబ్బంది అని ఆలోచించకుండా అభిమానులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. ఈ వేడుకలను పీఆర్ టీం ముందుండి నడిపించడం పట్ల మరింతగా విమర్శలు వస్తున్నాయి.
ఇదంతా ప్లాన్ ప్రకారమే చేసినట్లే కనిపిస్తోంది. అభిమానులను నియంత్రించాల్సిన వాళ్లే ఇలా ప్లాన్ చేయడమేంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రామ్ చరణ్ క్లిన్ కారతో ఆసుపత్రికి చేరుకున్నప్పుడు కూడా ఫ్యాన్స్ అత్యుత్సాహానికి ఎప్పుడూ కామ్ గా ఉండే చరణ్ కే కోపం వచ్చింది. చిరు కుటుంబానికి, మెగా అభిమానులకు ఈ మూమెంట్ ఎంతో ప్రత్యేకమైనది అయినప్పటికీ.. అభిమానులు ఎంతగా సమర్థించుకున్నా సరే ఇలా చేయడం తప్పు అనడంలో మరో మాట లేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates