15 సంవత్సరాల తర్వాత అజిత్ ర్యాంపేజ్

గత కొన్నేళ్లుగా రీ రిలీజుల ట్రెండ్ ఏ స్థాయిలో ఉందో చూస్తున్నాం. అలాని అన్నింటికి ఒకే రెస్పాన్స్ రావడం లేదు కానీ కొన్ని మాత్రం ఊహకందని స్థాయిలో సంచలనాలు సృష్టిస్తున్నాయి. తాజాగా తమిళనాడులో అజిత్ మంకతని భారీ ఎత్తున విడుదల చేశారు. 2011లో వచ్చిన ఈ గ్యాంగ్ స్టర్ డ్రామా అప్పట్లో పెద్ద బ్లాక్ బస్టర్.

వెంకట్ ప్రభు దర్శకత్వంలో యాక్షన్ కింగ్ అర్జున్ ముఖ్య పాత్రలో, త్రిష హీరోయిన్ గా చాలా ఇంటెన్స్ గా తెరకెక్కించారు. తెలుగులో ‘గ్యాంబ్లర్’గా డబ్బింగ్ చేస్తే ఇక్కడా సక్సెస్ అయ్యింది. వయసైన హీరోలకు సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ ఎంత బాగుంటుందో ఋజువు చేసిన మూవీ ఇది.

అభిమానులకు మంకత చాలా స్పెషల్. టీవీ, బ్లురే, ఓటిటి ఇలా చాలా ప్లాట్ ఫార్మ్ లో మిలియన్ల వ్యూస్ తెచ్చుకుంది. అయితే మళ్ళీ బిగ్ స్క్రీన్ ఎక్స్ పీరియన్స్ చేసే అవకాశం రాలేదు. ఇప్పుడు దొరికింది. దీంతో ఏదో కొత్త రిలీజ్ అన్నంత హడావిడి చేస్తున్నారు.

చెన్నైలోని ఐకానిక్ థియేటర్ రోహిణిలో ప్రీమియర్ షో టికెట్ అక్షరాలా రెండు వేల రూపాయల దాకా అమ్ముడుపోయిందంటే క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. బుక్ మై షోలో ముందస్తుగా అమ్ముడుపోయిన టికెట్లు 90 వేల పైమాటేనట. అడ్వాన్స్ గా నమోదైన గ్రాస్  రెండు కోట్ల ఇరవై లక్షల దాకా వచ్చి ఉంటుందని ట్రేడ్ టాక్. కౌంటర్ బుకింగ్స్ లెక్క వేరు.

ఇప్పటిదాకా రీ రిలీజుల్లో విజయ్ గిల్లి పేరు మీద ఉన్న రికార్డులను మంకత సులభంగా బద్దలు కొట్టబోతోందట. జన నాయకుడు వాయిదా తర్వాత కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. కార్తీ వా వతియార్, శివ కార్తికేయన్ పరాశక్తి రెండూ ఫ్లాప్ కాగా జీవా హీరోగా చేసిన సినిమా ఒకటే కొంత ఊరట కలిగించింది.

దీంతో ఎడారిలో ఒయాసిస్సు కోసం ఎదురు చూస్తున్న ఎగ్జిబిటర్లకు మంకత కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. ఇలాంటి కల్ట్ మూవీ ఇచ్చిన దర్శకుడు వెంకట్ ప్రభునే మన నాగ చైతన్యకు కస్టడీ లాంటి షాక్ ఇవ్వడం గమనార్హం. సోషల్ మీడియాలో అజిత్ ఫ్యాన్స్ హడావిడి ఓ రేంజ్ లో ఉంది.