మహేష్ కొత్త మల్టీప్లెక్స్… ఎంత పెద్ద సీటింగో

సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఏషియన్ మూవీస్ వాళ్లతో కలిసి హైదరాబాద్‌లో నిర్మించిన ‘ఏఎంబీ సినిమాస్’ మల్టీప్లెక్స్ ఎంత పెద్ద హిట్టో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. హైదరాబాద్‌లో పదుల సంఖ్యలో మల్టీప్లెక్స్ ఛైన్స్ ఉండగా.. వాటిలో దేనికీ లేనంత ఆకర్షణ ఏఎంబీకి ఉంది. ఇక్కడ కొత్త సినిమాలకు టికెట్లు పెడితే నిమిషాల్లో సేల్ అయిపోతాయి. పెద్దగా కంటెంట్ లేని చిత్రాలకు కూడా ఆక్యుపెన్సీలు బాగుంటాయి.

హైదరాబాద్‌లోనే మహేష్, ఏషియన్ భాగస్వామ్యంలో మరో మల్టీప్లెక్స్ కూడా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ లోపే పొరుగు రాష్ట్రం కర్ణాటకలో మహేష్-ఏషియన్ వారి మల్టీప్లెక్స్ అందుబాటులోకి వచ్చింది. బెంగళూరులో ఏఎంబీ సినిమాస్ సంక్రాంతి కానుకగా ప్రారంభించారు. నాలుగు స్క్రీన్లతో అక్కడి ఏఎంబీని అందుబాటులోకి తెచ్చారు.

హైదరాబాద్ ఏఎంబీ తరహాలోనే ఇక్కడ.. ‘ఏఎంబీ లగ్జ్’ పేరుతో లిమిటెడ్ సీట్లతో హై క్లాస్ లగ్జరీ థియేటర్‌ను నిర్మించారు. ఐతే ఈ మల్టీప్లెక్సు‌కు అసలైన ఆకర్షణ ఇది కాదు. ఇందులో 500కు పైగా సీటింగ్ సామర్థ్యంతో భారీ దాల్బీ సినిమా స్క్రీన్ ఉంది. ఇది సౌత్ ఇండియాలో తొలి దాల్బీ థియేటర్ కావడం విశేషం.

65 అడుగులతో భారీగానే ఈ స్క్రీన్‌ను నిర్మించారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు దాల్బీ సినిమా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. భారీ స్క్రీన్, సూపర్ క్లారిటీ, అదిరిపోయే సౌండ్‌తో ఈ థియేటర్లు ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని పంచుతున్నాయి. ఐమాక్స్ థియేటర్లకు దీటుగా నిలుస్తున్నాయి.

హైదరాబాద్‌లోని అల్లు సినిమాస్‌లో కూడా దాల్బీ థియేటర్ నిర్మాణం జరుపుకున్న సంగతి తెలిసిందే. అది ఇంకా అందుబాటులోకి రాలేదు. ఈలోపే బెంగళూరు ప్రేక్షకులను దాల్బీ థియేటర్ పలకరించింది. ఇక్కడ ప్రదర్శితమైన తొలి చిత్రం మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ కావడం విశేషం. ఏఎంబీ ఏర్పాటైంది బెంగళూరులో అయినా.. అక్కడ ప్రస్తుతం తెలుగు సినిమాలదే హవా. ప్రేక్షకుల్లో కూడా తెలుగు వాళ్లే ఎక్కువగా ఉన్నారు. త్వరలో మహేష్ ఈ మల్టీప్లెక్స్‌ను సందర్శించబోతున్నాడు.