2025 టాలీవుడ్ తొలి ప్యాన్ ఇండియా మూవీ రాజా సాబ్ విడుదలకు కేవలం వారం రోజులు మాత్రమే ఉంది. ప్రభాస్ అభిమానులు భారీ ఎత్తున సంబరాలకు రెడీ అవుతున్నారు. అంతకు ముందు ఏమో కానీ ట్రైలర్ వచ్చాక అంచనాల మీటర్ పైకి ఎగబాకింది. అందరికన్నా ముందు జనవరి 9 వచ్చే అడ్వాంటేజ్ ని పూర్తిగా వాడుకునేందుకు బయ్యర్లు రెడీ అవుతున్నారు.
ఆపై 12 నుంచి వరసగా వేరే సినిమాలు ఉంటాయి కాబట్టి ఓపెనింగ్స్ వరకు బిగ్గెస్ట్ నెంబర్స్ నమోదు కావడంలో ఒక్క శాతం అనుమానం అక్కర్లేదు. దర్శకుడు మారుతి నాన్ స్టాప్ గా మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ బోలెడు కబుర్లు విశేషాలు పంచుకుంటున్నారు.
ఇదిలా ఉండగా రాజా సాబ్ తక్షణం చేయాల్సిన కర్తవ్యం ఒకటుంది. అదే టికెట్ రేట్ల వ్యవహారం. ఏపీలో పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు కానీ తెలంగాణలో ఇటీవల అఖండ 2 విషయంలో జరిగిన కోర్టు పరిణామాల వల్ల అంత సులభంగా అనుమతులు రాకపోవచ్చు. సో దానికి సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ వర్క్ ఇప్పటి నుంచే సిద్ధం చేసుకోవాలి.
లీగల్ గా ఎదురయ్యే చిక్కులకు ముందస్తు పరిష్కారాలు చూసి పెట్టుకోవాలి. నిర్మాత విశ్వప్రసాద్ ఈ విషయంలో అలెర్ట్ గానే ఉంటారు కాబట్టి ఇబ్బంది లేదు కానీ రేవంత్ రెడ్డి సర్కారుని ఒప్పించి జిఓలు, స్పెషల్ షోలు త్వరగా తెచ్చుకోవడం అసలు టాస్క్.
అసలే పెద్ద హీరోల సినిమాలు లేక బాక్సాఫీస్ డల్లుగా ఉంది. ఏదో శంబాల, అఖండ 2, ఈషాలతో లాక్కొస్తోంది కానీ వీక్ డేస్ థియేటర్ ఆక్యుపెన్సీలు మరీ అన్యాయంగా ఉన్నాయి. ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే రాజా సాబ్ వల్లే సాధ్యం.
ప్రమోషన్ల వరకు టీమ్ ఎంత చేయాలో అంతా చేసింది. ప్రీ రిలీజ్ అయిపోయింది. ప్రభాస్ అబ్రాడ్ వెళ్లిపోతున్నారు. మారుతీ, తమన్ చివరి టచప్స్ లో బిజీ. నిర్మాత బిజినెస్ వ్యవహారాలు, థియేటర్ల అగ్రిమెంట్లు వగైరా చూసుకోవాలి. ఈ నేపథ్యంలో చివరి నిమిషం దాకా ఒత్తిడి ఉండకూడదు అనుకుంటే ముందు జిఓల సంగతి తెలిస్తే సెలబ్రేషన్స్ అభిమానులు చూసుకుంటారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates