టాలీవుడ్లో మరో సెలబ్రెటీ పెళ్లికి రంగం సిద్ధమైంది. అల్లు అరవింద్ కొడుకుల్లో అందరి కంటే చిన్నవాడైన శిరీష్ ఒక ఇంటివాడు కాబోతున్న సంగతి ఇప్పటికే వెల్లడైంది. నయనిక అనే అమ్మాయితో ప్రేమలో పడ్డ శిరీష్.. గత అక్టోబరులో నిశ్చితార్థం చేసుకున్నాడు. హైదరాబాద్లో ఘనంగా వీరి ఎంగేజ్మెంట్ జరిగింది. ఐతే ఎంగేజ్మెంట్ అయి మూడు నెలలు కావస్తున్నా ఇంకా పెళ్లి డేట్ అనౌన్స్ చేయలేదు.
మరి వివాహం ఎప్పుడా అని సినీ అభిమానుల్లోనే కాదు.. అల్లు కుటుంబంలోని పిల్లల్లోనూ క్యూరియాసిటీ నెలకొంది. ఈ నేపథ్యంలో అల్లు బాబీ, అల్లు అర్జున్ల పిల్లలు.. తమ బాబాయిని పెళ్లి డేట్ గురించి అడిగారు. బాబాయ్ పెళ్లి ఎప్పుడు అని 2026 మార్చి 6 అని అతను బదులివ్వడం.. సంగీత్ ఎప్పుడు అని అడిగితే, మనం సౌత్ ఇండియన్స్ మనకు అలాంటివి ఉండవు అని చెప్పడం.. ఇలా ఒక ఫన్నీ రీల్ చేసి పెళ్లి డేటును అనౌన్స్ చేసింది అల్లు కుటుంబం.
సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన మీమ్ వీడియో టెంప్లేట్లో ఈ రీల్ చేశారు. అది చూసి పెళ్లి డేటును ఇలా కూడా అనౌన్స్ చేస్తారా అని చర్చించుకుంటున్నారు నెటిజన్లు.
నయనికతో తన పరిచయం, ప్రేమ గురించి ఎంగేజ్మెంట్ తర్వాత శిరీష్ ఒక సోషల్ మీడియా పోస్టు పెట్టాడు.
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల పెళ్లే.. నయనికతో తన ప్రేమకు పునాది అని అందులో శిరీష్ వెల్లడించాడు. వరుణ్, లావణ్యల పెళ్లి తర్వాత యంగ్ హీరో నితిన్, అతడి భార్య షాలిని కలిసి ఒక పార్టీ ఇచ్చారట. ఆ వేడుకకు షాలిని బెస్ట్ ఫ్రెండ్ అయిన నయనిక కూడా వచ్చిందట. తొలిసారి తనను అప్పుడే చూశాడట శిరీష్. నాటి పరిచయం తర్వాత తామిద్దరం ప్రేమలో పడ్డామని.. ఇప్పుడు నిశ్చితార్థం చేసుకున్నామని శిరీష్ తెలిపాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates